ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జీవీఎంసీలో... నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన' - జీవీఎంసీ ఎన్నికలు

జీవీఎంసీ పరిధిలోని వార్డుల పునర్విభజన నిమిత్తం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్​ సవాలు చేస్తూ విశాఖకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.... కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

The wards were divided against the norms in the GVMC
The wards were divided against the norms in the GVMC

By

Published : Jan 30, 2020, 12:13 AM IST

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) వార్డుల పునర్విభజన నిమిత్తం ఈ నెల 24న జారీచేసిన తుది గెజిట్ నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేసే అవకాశం ఉందో తెలపాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్​మోహన్ రెడ్డి(ఎస్​జీపీ)ని కోరింది . ఈ వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేసేలోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిస్తూ నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేసే విషయం తనకు తెలియదని, వివరాలు కనుక్కొని కోర్టు ముందు ఉంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేశారు.

సగటు జనాభా లేరు

వార్డుల పునర్విభజన నిమిత్తం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్​ సవాలు చేస్తూ విశాఖకు చెందిన వెంకట ప్రణవ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన చేశారన్నారు. అభ్యంతరాల సమర్పణకు వారం రోజులు గడువిస్తే అందులో నాలుగు రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయని చెప్పారు. సుమారు 50 వార్డుల్లో చట్ట నిబంధనల మేరకు సగటు జనాభా లేదన్నారు. మరికొన్ని వార్డుల్లో సగటు జనాభాకు మించి ఉన్నారన్నారు. జీవో జారీచేసిన రోజే ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. ఆ నోటిఫికేషన్​పై కోర్టు విచారణ జరుపుతున్న సమయంలో తుది నోటిఫికేషన్ ఇచ్చారన్నారు.

విచారణార్హత లేదు

ఎస్​జీపీ వాదనలు వినిపిస్తూ తుది నోటిఫికేషన్ జారీలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదన్నారు. తుది నోటిఫికేషన్ ఇచ్చాక జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. అభ్యంతరాల సమర్పణకు 10 రోజుల సమయం ఇవ్వగా... సెలవు రోజుల్లో సైతం కార్యాలయాలు తెరిచి అభ్యంతరాలు స్వీకరించారన్నారు. పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని వెల్లడించారు. వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయడానికి పదిరోజుల సమయం కావాలని ఎస్​జీపీ కోరారు. ఈ లోపు ఎన్నికల ప్రకటన జారీ చేయకుండా ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎస్​జీపీ స్పందిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వనున్నారో తనకు తెలియదని చెప్పారు. ఆ వివరాలు కనుక్కొని చెప్పాలంటూ న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి:జీవీఎంసీని సీఎంకు కానుకగా ఇవ్వాలి: మంత్రి అవంతి

ABOUT THE AUTHOR

...view details