ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ దారి బొందల దారి.. అటువైపు వెళ్లకపోవడమే మంచిది!

By

Published : Dec 16, 2021, 7:50 PM IST

నాలుగు రాష్ట్రాల వాహనాలు ప్రయాణించే రహదారి అది. ఘాట్ రోడ్డుతో ఇరుకుగా ఉండే ఈ రోడ్డులో.. పొరపాటున వాహనం అదుపు తప్పితే వందల అడుగుల లోయల్లోకి పడిపోవాల్సిందే. ప్రమాదాలకు నిలయంగా ఉన్నా.. అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. గోతులు, గుంతలమయమైనా కనీసం తట్టమట్టి వేసిన పాపాన పోలేదు.

BAD ROADS
BAD ROADS

విశాఖ జిల్లా నుంచి తూర్పు కనుమల మీదగా ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అది. ఐదు దశాబ్దాల కిందట వేసిన ఈ రోడ్డు ఇప్పటికీ విస్తరణకు నోచుకోలేదు. ఈ రహదారిలో ఎదురుగా వాహ‌నం వ‌స్తే పక్కకు తప్పుకోవడం చాలా కష్టం. దీనికి తోడు రోడ్డుపైన గుంతలు వాహనదారులకు ప్రాణసంకటంగా మారుతున్నాయి.

విశాఖ జిల్లా ఆర్.వి. న‌గ‌ర్ నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలగడ్డ వరకు 73 కిలోమీటర్ల రహదారి ప్రయాణానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం నిత్యం వందల వాహనాలతో కిటకిటలాడుతోంది. ర‌హ‌దారికి ఇరువైపులా ఉన్న రక్షణ గోడ‌లు సైతం దెబ్బతిన్నాయి. గోతుల మయమైన రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు భయపడుతున్నారు.

సీలేరు నుంచి ఈ రోడ్డును 2 వ‌రుస‌ల ర‌హ‌దారిగా విభ‌జించి అభివృద్ధి చేసేందుకు 84 కోట్లతో టెండర్ల ప్రక్రియ 2018 నవంబరులో పూర్తి చేశారు. కానీ ఈ ప్రాంతమంతా రిజర్వ్‌ ఫారెస్ట్‌ కావడం వల్ల.. అటవీ శాఖ అభ్యంతరాలతో కొంత కాలం పనులు నిలిచిపోయాయి. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులిచ్చినా.. పనులు ముందుకు సాగడం లేదని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూడెం కొత్తవీధి, ఆర్‌వీ న‌గ‌ర్ వరకు రోడ్డు మరీ దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. కొత్తవారు ఈ దారిలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా.. అధికారులు మాత్రం మరమ్మతులు చేపట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Young man died while moving marijuana: గంజాయి తరలిస్తుండగా ప్రమాదం..యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details