సరైన ఉపాధి లేక నక్సలిజం, గంజాయి రవాణా లాంటి పెడ ధోరణుల బారిన పడుతున్న విశాఖ మన్యం యువత జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. 'స్ఫూర్తి' పేరుతో విశాఖ జిల్లా పోలీసులు చేపట్టిన శిక్షణ కార్యక్రమం సరికొత్త మార్పు తెచ్చింది. 2018లో 'స్టాఫ్ సెలక్షన్ కమిషన్' చేపట్టిన ఉద్యోగాల భర్తీలో.. మన్యం ప్రాంతం నుంచే ఏకంగా 32 మంది ఉద్యోగాలు సాధించారు. వారిలో నలుగురు అమ్మాయిలూ ఉన్నారు. నాడు కరోనా కారణంగా నిలిచిన నియామక ప్రక్రియ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి.
ఐటీడీఏ ఆర్థిక సహకారంతో పోలీసులు చేపట్టిన కార్యక్రమం ద్వారా.. రెండు విడతల్లో 112 మంది గిరిజన యువత కేంద్ర పారామిలటరీ బలగాల్లో ఉద్యోగాలు పొందారు. ఆన్లైన్ పరీక్షపై అవగాహన లేని వారిని.. నాణ్యమైన శిక్షణ సంస్థల ద్వారా పోలీసులు సానబట్టారు. హైదరాబాద్ నుంచి నిపుణులను రప్పించి.. గణితం, ఆంగ్లంపై 45 రోజుల శిక్షణ ఇచ్చారు. శరీర దారుఢ్యం పెంచేలా పోషకాహారం సహా.. విశాఖ, తిరుపతి, విజయవాడ వెళ్లి పరీక్షలు రాసేందుకు అవసరమైన ప్రయాణ, వసతి ఖర్చులు సమకూర్చారు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి ప్రభుత్వ ఉద్యోగులుగా గిరిజన యువత ఎదిగారు.