ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 13, 2020, 3:57 PM IST

ETV Bharat / city

నిబంధనలకు పాతర... ఫార్మా వ్యర్థజలాలు చెరువుల్లోకి..!

విశాఖ ఫార్మాసిటీలో పరిసర గ్రామాల్లోని చెరువులు ఫార్మా వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పరవాడ ఊర, పెద్ద చెరువులు ఫార్మా వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారుతున్నాయి. ఘాటైన దుర్వాసన వల్ల జలచరాలు మృత్యువాత పడుతుండడంతో.. జిల్లా యంత్రాంగం పరిశీలనకు ఓ కమిటీని వేసింది. భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఫార్మా సిటీ నిర్వాహకులు మాత్రం ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసే బయటకు పంపుతున్నామని అంటున్నారు.

ramky  pharma city
ramky pharma city

విశాఖ జిల్లా పరవాడలో దాదాపు రెండున్నర వేల ఎకరాలలో ఫార్మాసిటీ విస్తరించి ఉంది. ఈ ఫార్మాసిటీలో 103 పరిశ్రమలకు అనుమతి ఉంది. ఇందులో 85 పరిశ్రమలు ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలను చేస్తున్నాయి. కొవిడ్ సమయంలో ఫార్మా రంగం నిరంతరాయంగా పని చేయడం, కావాల్సిన ఉత్పత్తులు వివిధ ఔషధాలను ఇక్కడే సిద్ధం చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. 32 వేల మందికి పైగా ఈ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఫార్మాసిటీలో ఉన్నాయి. ఇందులో రూ.20 వేల కోట్ల ఉత్పత్తులు జరుగుతున్నాయి.

ఫార్మా పరిశ్రమ అంటేనే కాలుష్యం గరిష్టంగా ఉండే రెడ్ జోన్ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఫార్మా పరిశ్రమలు ఒకే చోట ఉండడం వల్ల వాటి ఘన, ద్రవ వ్యర్థాలన్నింటిని శుద్ధి చేశాకే బయటకు వదలాలన్న నిబంధన తప్పని సరిగా పాటించి తీరాలి. రాంకీ ఫార్మాసిటీలో ఘన వ్యర్ధాలతో పాటు అటు వ్యర్ధజలాలను శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేందుకు అనుమతి ఉంది. ఈ వ్యర్థ జలాలు నేరుగా సముద్రంలోకి వెళ్తాయి. నిర్దేశిత మొత్తంలో మాత్రమే కాలుష్యాలు అందులో ఉండేట్టుగా జలచరాలకు ఎటువంటి హాని చేయని విధంగా వ్యర్థజలాలను శుద్ధి చేసిన తర్వాతనే కాలుష్య నియంత్రణ మండలి నిరంతర పర్యవేక్షణలో విడిచిపెట్టాలన్నది నిబంధన. ఈ నిబంధనను తాము పాటిస్తున్నామని రాంకీ వర్గాలు వివరిస్తున్నాయి.

వర్షాల సమయంలో ఫార్మా వ్యర్థ జలాలు గడ్డలు, కాలువల ద్వారా వచ్చి చెరువుల్లో చేరుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరవాడ పెద్ద చెరువులో కాలుష్యం వల్ల చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వ్యవసాయ భూములు, భూగర్భజలాలు కలుషితమైపోతున్నాయన్నది గ్రామస్థుల ఆవేదన.

పరవాడ ఫార్మాసిటీని అనుకుని ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో ఊర చెరువు ఉంది. ఇది నిండిన తర్వాత 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులోకి నీరు చేరుతుంది. ఇటీవల వర్షాలకు ఈ రెండు చెరువులు పూర్తి స్థాయిలో నీరు చేరడం వల్ల చేపలు వేశారు. అవి పెరుగుతున్న సమయంలో కాలుష్య కారకాలు ఈ చెరువులో చేరడం వల్ల పెద్ద సంఖ్యలో జలచరాలు చనిపోయాయి. ఫార్మాసిటీలో ఉన్న సంస్థలు వ్యర్థజలాలను రాంకీ ట్రీట్​మెంట్ ప్లాంట్​కి పంపాలంటే వారికి ఫీజులు చెల్లించాల్సి ఉన్నందున ప్లాంట్​కి విడిచిపెట్టకుండా నేరుగా వదిలేస్తున్నారన్నది రైతుల ఆరోపణ.

తమ ట్రీట్​మెంట్ ప్లాంట్ నుంచి శుద్ధి చేసిన నీటిని పరిమితులకు లోబడి నేరుగా సముద్రంలోకి మాత్రమే విడిచిపెడుతున్నామని రాంకీ యాజమాన్యం చెబుతోంది. గ్రామస్థుల ఆరోపణలపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఓ కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ఏ వివరాలు అడిగినా సమర్పిస్తామని ఫార్మాసిటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రమాదకర రసాయన వ్యర్థాలను బయటకు విడిచిపెట్టేందుకు అవకాశం లేదన్నది రాంకీ వాదన. కాలువల నుంచి ఎటువంటి నీటిని వదలవద్దని గతంలోనే ఫార్మాసంస్ధలకు కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇదీ చదవండి

వైకాపాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

ABOUT THE AUTHOR

...view details