Villagers Protest against Sea Food Company : నాగ హనుమాన్ సీ ఫుడ్ కంపెనీని మూసేయాలని విశాఖ జిల్లాలోని పాలవలస గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా నేడు నాలుగోరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెబుతున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు.
గ్రామంలో ఇప్పటికే సుమారు 40 మంది కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారని, వారిలో 20 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 8 మంది ఇంటి వద్దనే వైద్యుల సలహాలతో మందులు వాడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇన్ని సమస్యలకు కారణమవుతున్న నాగ హనుమాన్ సీ ఫుడ్ కంపెనీని మూసేయాలని డిమాండ్ చేశారు. కంపెనీని మూసే వరకు పోరాడతామని కరాఖండిగా తెలిపారు.