విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేసే నిర్ణయంపై తెదేపా నేత, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు నాయకుల గళం ఎందుకు మూగబోతుందని ప్రశ్నించారు. మనలో మనకు ఆత్మాభిమానం ఎందుకు కొడిగట్టిందని నిలదీశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలు పలు అనుమానాలను కలిగిస్తున్నాయని అన్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఊసు లేకపోయినా గట్టిగా గళమెత్తిన పరిస్థితులు లేవని అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడిన వారు కూడా కంటితుడుపు మాటలు తప్ప.. మన రాష్ట్రానికి న్యాయం చేద్దామనే ఆలోచన అసలు ఏ మాత్రం లేదన్నారు.
"విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తామంటే మాట్లాడిన నాయకులు లేరు... మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది.. పార్లమెంట్ సభ్యులు ఉన్నారు.. వారు మన కోసం ఆలోచిస్తున్నారని, మనకు న్యాయం జరిగేలా పోరాడుతున్నారని మనం ఆశించడం అడియాశే అవుతుంది. స్వప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్నని వారు గ్రహించే వరకు మన గతి ఇంతే.. వేలాదిమందికి ఉపాధి కల్పించి, విశాఖను మహానగరంగా చేసింది స్టీల్ ప్లాంట్. ఇప్పుడూ కోటానుకోట్ల సంపద ప్రైవేటుపరం అవుతుంటే ఎందుకు నోళ్లు మెదపలేకపోతున్నారు?" - మండలి బుద్ధ ప్రసాద్