ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"జాగృతి" నేర్పిన జీవిత పాఠం.. ఓ పొదుపు సంఘం సక్సెస్ స్టోరీ! - vishaka district news

మహిళలకు పొదుపు నేర్పి.. వారి జీవితాలకు భద్రత కల్పించే లక్ష్యంతో ఏర్పడిన పరస్పర సహకార పొదుపు సంఘం(Jagriti Mutual Cooperative Savings Society) జాగృతి. అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఈ సంఘం.. గ్రామాల్లో మహిళా సాధికారితతోపాటు సామాజిక, ఆర్థిక మార్పులకు నాంది పలుకుతోంది. విశాఖ జిల్లాలోని గ్రామీణ మహిళల జీవితంలో అమూల్యమైన మార్పులకు శ్రీకారం చుట్టిన 'జాగృతి'పై ఓ సక్సెస్ స్టోరీ.

మహిళలకు అండగా జాగృతి పొదుపు సంఘం
మహిళలకు అండగా జాగృతి పొదుపు సంఘం

By

Published : Oct 9, 2021, 4:10 PM IST

మహిళలకు అండగా జాగృతి పొదుపు సంఘం.. రుణాలతో చేయూత

విశాఖ జిల్లాలో నమోదైన మొదటి సహకార సంఘం జాగృతి సంస్థ. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో.. మహిళలకు పొదుపు అలవాటు చేయడం కోసం 1992లో సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలో ఈ పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేశారు. మండలంలోని దేవీపురానికి చెందిన ఎన్‌.ప్రహ్లాదశాస్త్రి.. ఈ సంఘం ఏర్పాటుకు ఆద్యుడు. పది మందితో మొదలైన ఈ సంఘం.. ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

2021 నాటికి జిల్లాలోని సబ్బవరం, గాజువాక, పరవాడ, పెందుర్తి, కె.కోటపాడు, అనకాపల్లి మండలాల్లోని 259 గ్రామాల్లో ఏకంగా.. 22 వేల మంది మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్లంతా 18 కోట్లకుపైనే పొదుపు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటి నుంచి 23వ తేదీ వరకు.. సిబ్బంది గ్రామాలకు వెళ్లి.. మహిళా మండలి కన్వీనర్‌ ఆధ్వర్యంలో రుణాలు అందజేస్తారు. ప్రస్తుతం 5 వేల నుంచి పది వేల రూపాయల వరకు గ్రామాల్లో రుణం అందిస్తున్నారు. అంతకుమించి రుణం కావాలనుకునే వారు బ్యాంకులో తీసుకోవాల్సి ఉంటుంది.

''మహిళల అభివృద్ధికోసం ఈ సంఘాన్ని నెలకొల్పుకున్నాం. సహకార వ్యవస్థ చట్టప్రకారం దీనిని ఏర్పాటు చేయడంతో భద్రత కల్పించాం. మహిళలు తమకాళ్లమీద తాము నిలబడేలా చేసేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం.''- సుజాత, జాగృతి సంస్థ ఎండీ

''ఇది ఒక మూవింగ్ బ్యాంకు. బ్యాంకే వినియోగదారుల ఊరికి వెళ్లి సేవలను అందిస్తుంది. రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు వారి ఇంటి వద్దే రుణం అందిస్తాం. ఎక్కువ మెుత్తంలో లోన్ కావాలంటే ఆఫీస్ కు రావలసి ఉంటుంది.'' - మౌక్తిక, జాగృతి సంస్థ సీఈఓ

గ్రామీణ రైతులను ఆదుకునేందుకు 7 మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆరు నాబార్డు సహకారంతో ఏర్పాటు చేయగా, ఒకటి ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో 5 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సరుకులను పట్టణాలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. రైతులు పండించిన ఉత్పత్తులతో ఇటీవల సబ్బవరంలో ఓ సూపర్‌మార్కెట్‌ ఏర్పాటు చేశారు. పంటలను నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగి ఏర్పాటు చేశారు. సరకు రవాణా కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని సమకూర్చుకున్నారు.

''గడచిన పది సంవత్సరాలుగా ఈ సంస్థలో సభ్యురాలిగా ఉంటూ లబ్ధి పొందుతున్నా. జాగృతి నుంచి రుణం తీసుకుని వ్యవసాయం చేస్తున్నాం. రైతు బజారు కంటే మంచి ధర అందించి సంస్థ మార్కెటింగ్ చేస్తోంది. ఈ సదుపాయాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.'' - నాగమణి, జాగృతి రైతు విభాగం

జాగృతి సంస్థ ద్వారా ఎంతో మంది మహిళలు.. ఉపాధి అవకాశాలు పొంది వ్యాపారాలు చేస్తున్నారు. ఈ సంస్థ ఎండీ, సీఈవో, తొమ్మిది మంది బోర్డు సభ్యులుగా.. మహిళలే కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి:

వ్యాపారుల మోసాలు.. వినియోగదారుల జేబులకు చిల్లులు..

ABOUT THE AUTHOR

...view details