విశాఖ ఐఐఎం నూతన ప్రాంగణాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. గంభీరంలో రూపుదిద్దుకుంటున్న ఈ కట్టడం... రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీని నిర్మాణ బాధ్యతలను షాపూర్జి పన్లోన్జి సంస్థ చేపట్టింది. 241.50 ఎకరాల్లో అత్యంత సుందరమైన ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ఇప్పటికే విస్తృత కసరత్తు చేశారు. భవనాల్లో సదుపాయాలకు సంబంధించిన 1800 డ్రాయింగ్స్ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆయా డ్రాయింగ్స్కు అనుగుణంగా నూతన ప్రాంగణాన్ని నిర్మిస్తారు. దిల్లీకి చెందిన ‘ఆర్కాప్’ అనే సంస్థ డిజైన్లు రూపొందించింది. ఐ.ఐ.ఎం.లో ఉండే వసతుల ఆధునికతను గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే..
రెండు దశలకు రూ.807.69కోట్ల వ్యయం....
మొదటిదశలో 600 మంది విద్యార్థులకు సరిపడా వసతులు రూ.392.48కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. మొదటిదశ పూర్తైతే 60,384 చదరపు మీటర్ల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.
రెండోదశ పూర్తైన తరువాత మొత్తం 1,15,800 చదరపు మీటర్ల సువిశాల విస్తీర్ణంలో భవనాలు, తరగతి గదులు, ఇతర వసతులు అందుబాటులో ఉంటాయి. మొత్తం 1170 మందికి విద్యాబోధన చేయడానికి అవసరమైన సమగ్ర సదుపాయాలు కల్పిస్తారు. రెండు దశల నిర్మాణాలు పూర్తయ్యేసరికి రూ.807.69కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఐదు నక్షత్రాల హోటల్ను తలపించేలా వసతిగృహాలు..
విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థుల వసతిగృహాల్లోని ప్రతి గదిలోనూ ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఒవెన్, కెటిల్, వాషింగ్ మిషన్ తదితరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఐదునక్షత్రాల హోటల్ వసతులకు దీటుగా వసతిగృహాలు నిర్మిస్తారు.
60 గదులతో అతిథిగృహం...
ఐ.ఐ.ఎం. విద్యార్థులకు బోధించడానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరచూ వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు బస చేయడానికి వీలుగా 60 గదులతో అతిథిగృహాన్ని నిర్మిస్తారు.
ఆధునికతకు చిరునామాగా తరగతి గదులు..
తరగతి గదులను ఆధునికతకు చిరునామాలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం హార్వార్డ్ విశ్వవిద్యాలయ మోడల్ను ఆదర్శంగా తీసుకుని అంతకు మించిన ఆధునికత ఉట్టిపడేలా డిజైన్లు రూపొందించారు. విద్యార్థులు 'యూ' ఆకారంలో కూర్చొంటారు. 50 మంది, వంద మంది విద్యార్థులు కూర్చొనేలా శీతలీకరణ తరగతి గదులుంటాయి. ఆచార్యులు పాఠం చెప్పడం మొదలుపెడితే సెన్సర్లు గ్రహించి స్పీకర్లు వాటంతటవే పనిచేస్తాయి. విద్యార్థులు మాట్లాడితే వారి మాటలు కూడా సెన్సర్లు గ్రహించి స్పీకర్లలో వినిపిస్తాయి. దీంతోపాటు మాట్లాడుతున్న విద్యార్థి ఫొటో అందరికీ కనిపించేలా బోర్డ్పై దానంతటదే ప్రత్యక్షమవుతుంది. అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలన్నీ ఆయా తరగతి గదుల్లో ఉంటాయి.
వంద సీట్ల తరగతి గదులు-10, 50 సీట్ల తరగతి గదులు-10, అదనపు తరగతి గదులు 5 అందుబాటులో ఉంటాయి. తరగతి గదుల్లో చెప్పే పాఠాలన్నీ రికార్డవుతాయి. 15 రోజులపాటు వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. ఫలితంగా ఆయా పాఠ్యాంశాలను విద్యార్థులు ఎన్నిసార్లైనా వినవచ్చు. ఆచార్యులకు 117 కార్యాలయాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు.
1500 కిలోవాట్ల సౌర విద్యుత్తు ప్లాంటు..