ప్రశాంత సింహాచల దేవస్థానం.... మరో వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఛైర్పర్సన్గా సంచయిత నియామకంపై వాదప్రతివాదాలు నడుస్తుండగానే.... ఇప్పుడు ఆలయంతో సంబంధం లేని వ్యక్తిని ఓఎస్డీగా నియమించాలనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనధికారికంగా అన్ని సౌకర్యాలతో 4 నెలలుగా అతను సింహగిరిపై తిష్ఠ వేయడమే కాక.... దేవదాయ ఆస్తుల రికార్డులు పరిశీలించడం దుమారం రేపుతోంది. ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి వివిధ అంశాల్లో సంచయితతో భేదాభిప్రాయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే కార్తీక సుందర రాజన్ నియామకంపై ఒత్తిడి కొనసాగింది. పాలకమండలిలో దీని తీర్మానంపై వ్యతిరేకత వచ్చినా.... రూల్ పొజిషన్ ఎలా ఉంటే అలా చేయాలని నిర్ణయించిన అంశాలన్నీ బయటకు రావటంతో దేవస్థానంలో కలకలం రేగుతోంది.
సింహగిరిపై మరో కొత్త వివాదం... ! - విశాఖ జిల్లా వార్తలు
సింహాచల దేవస్థానం ఛైర్పర్సన్ సంచయిత గజపతిరాజు వ్యవహారశైలిపై ఆరోపణలు కొనసాగుతునే ఉన్నాయి. ఈమెతో వేగలేక తనను ఈవోగా తప్పించాలని కోరుతూ... భ్రమరాంబ ఉన్నతాధికారులకు రాసిన లేఖలోని విషయాలు బయటకు రావడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఆలయానికి సంబంధం లేని వ్యక్తిని ఓఎస్డీగా నియమించాలనుకోవడం వద్ద మొదలైన వివాదం... అతను కొండపైనే తిష్ఠ వేసి పెత్తనం చేసే వరకూ సాగింది.
![సింహగిరిపై మరో కొత్త వివాదం... ! Allegations continue against simhachalam temple chairperson sanchitha Gajapatiraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8673922-32-8673922-1599204822516.jpg)
సంచయిత వ్యవహారశైలితో అనేక భేదాభిప్రాయాలు ఉన్నా... వాటిని బయట ఎక్కడా ప్రస్తావించకుండా తన ఇబ్బందులన్నీ ఉన్నతాధికారులకు నివేదించి.. ఈవో బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ భ్రమరాంబ అభ్యర్థించారు. అప్పట్నుంచి అన్నవరం ఈవో త్రినాథ్కు సింహాచల దేవస్థాన అదనపు బాధ్యతలు అప్పగించారు. భ్రమరాంబ ఉన్నతాధికారులకు రాసిన లేఖలో సంచయితకు సంబంధిత అంశాలు ఇప్పుడు బయటకు రావడం వివాదాస్పదమైంది. గతంలో జరిగిన గ్రావెల్ తవ్వకాలు, ఘాట్ రోడ్డు నిర్మాణం, దేవాలయ ఆస్తుల ఆక్రమణలను అడ్డుకోలేకపోవడంపై విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే... ఈ వ్యవహారం బయటకు పొక్కడం చర్చలకు తావిస్తోంది.
ఇదీ చదవండి:జగన్ తీరుతో వైఎస్ ఆత్మ క్షోభిస్తుంది: సుంకర పద్మశ్రీ