తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన పోరాటం ఫలించింది. యువకుడి కుటుంబసభ్యులు వివాహానికి ఒప్పుకోవడం వల్ల రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయి.
ఫలించిన ప్రియురాలి మౌన పోరాటం - ప్రేమించినవాడి కోసం యువతి మౌన పోరాటం వెంకట్రావుపేట వార్తలు
ప్రేమించినవాన్ని పోరాడి మరీ సాధించుకుంది ఓ యువతి. యువకుడి తల్లిదండ్రులు వారి వివాహానికి ఒప్పుకోలేదని.. బాధపడలేదు. ఇక ఇంతేలే అని ఊరుకోలేదు. ప్రేమించినవాడి ఇంటి ఎదుట మౌన పోరాటం చేసింది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న యువతి మౌన దీక్షను చూసి గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు చలించిపోయారు. రెండు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు.
![ఫలించిన ప్రియురాలి మౌన పోరాటం ఫలించిన ప్రియురాలి మౌన పోరాటం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9083546-902-9083546-1602069620112.jpg)
జిల్లాలోని జన్నారం పట్టణానికి చెందిన లలిత.. వెంకట్రావుపేటకు చెందిన అరుణ్ ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి యువకుడి కుటుంబసభ్యులు నిరాకరించారు. లలిత కుటుంబసభ్యులతో కలిసి అరుణ్ ఇంటి ఎదుట నాలుగు రోజులుగా మౌన పోరాటం చేస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేస్తుండగా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. స్థానిక పెద్దమ్మ గుడి వద్ద రెండు కుటుంబాలు, ప్రజాప్రతినిధులు చర్చించి యువకుడి కుటుంబసభ్యులను వివాహానికి ఒప్పించారు. అనంతరం ఇద్దరికి నిశ్చితార్థం చేసి త్వరలోనే వివాహం జరిపిస్తామని హామీ ఇవ్వడం వల్ల యువతి కుటుంబసభ్యులు శాంతించారు.