Water Levels in Projects: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని గోదావరికి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. జోరు వానలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్సాగర్కు వరద పోటెత్తుతోంది. సాయంత్రం వరకు 4 లక్షల 92 వేల క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 72.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులకుగాను.. ప్రస్తుతం 1086.7 అడుగుల మేరకు నీరు చేరింది. దీంతో అధికారులు 9 గేట్లు ఎత్తి 35 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 20 గేట్లు ఎత్తి లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది. కడెం నారాయణ రెడ్డి జలాశయం నిండుకుండలా మారింది. భారీగా వరద ప్రవాహంతో 9 గేట్లు ఎత్తారు. కడెం పూర్తిస్థాయి నీటిమట్టం 7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6 టీఎంసీలకు పైగా నిల్వ ఉంది.
గోదావరితో పాటు ప్రాణహిత ప్రవాహ ఉద్ధృతితో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు వరద పోటెత్తుతోంది. లక్ష్మీ-మేడిగడ్డ బ్యారేజీకి దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో 57 గేట్లు ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు. పార్వతి, సరస్వతి బ్యారేజీలకు కూడా ఎగువ నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. రానున్న అయిదారు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
అన్ని జలాశయాల్లో కళకళ: చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి 10 వేల 300 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి 13 వేల 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవటంతో రెండు గేట్లు ఎత్తి వెయ్యి 96 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 458 మీటర్లకుగాను.. ప్రస్తుతం 457.60 మీటర్ల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 13 వందల 92 అడుగులు, నిల్వ సామర్థ్యం 5.474 టీఎంసీలుగా ఉంది. నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 6వేల 690క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. అంతే మొత్తంలో దిగువకు వెళ్లిపోతోంది. 14వందల 64 అడుగుల పూర్తి నీటి మట్టంతో 1.8 టీఎంసీల పూర్తి నీటి నిల్వతో ప్రాజెక్టు ఉంది.