విజయవాడ దుర్గగుడిలో జరిగే అవకతవకలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు విజిలెన్స్, ఏసీబీ లాంటి విభాగాల సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు చేస్తుంటారు. అనేక అక్రమాలను గుర్తిస్తుంటారు. ఏయే విభాగాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు? అమ్మవారి ఆదాయం ఎలా పక్కదారి పడుతోంది, బాధ్యులు ఎవరనే వివరాలన్నింటితో నివేదికలు రూపొందించి దేవాదాయ శాఖకు ఇస్తుంటారు. వాటి ఆధారంగా వెంటనే కొంతమంది సిబ్బందిపై అధికారులు చర్యలు చేపడతారు.
దుర్గగుడిలో జరిగే అవకతవకలన్నింటినీ అరికడతామని, మొత్తం ప్రక్షాళన చేసేస్తామన్నట్టుగా కొద్దిరోజులు హడావుడి చేస్తారు. అంతే ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మరచిపోతారు. సరిగ్గా ఓ మూడు నాలుగు నెలల తర్వాత.. సదరు సిబ్బంది రాజకీయ, అధికార పలుకుబడిని ఉపయోగించి సిఫార్సులతో విధుల్లోకి చేరిపోతారు. మళ్లీ పాత పంథాలోనే అక్రమాలు కొనసాగుతుంటాయి. ఫలితంగా.. దుర్గగుడిలో ఎంత పెద్దస్థాయిలో అక్రమాలు జరిగినా తాత్కాలిక హడావుడి, కంటితుడుపు చర్యలే తప్ప.. ప్రక్షాళన మాత్రం జరగడం లేదన్న విమర్శలున్నాయి.
కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న వెండి రథం సింహం బొమ్మలను చోరీ చేసిన ఘటనలోనూ ఒక్కరంటే ఒక్కరిపైనా చర్యలు లేవు. ఘటన జరిగినప్పుడు మాత్రం బాధ్యులైన వారందరిపై చర్యలుంటాయని ప్రకటించారు. వెండి రథం పర్యవేక్షణ చూడాల్సిన సిబ్బంది చాలా మందే ఉన్నా ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు.
దేవాదాయశాఖ చరిత్రలోనే ఏ ఆలయంలోనూ జరగనంత పెద్దఎత్తున విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఫిబ్రవరి నెలలో వరుసగా నాలుగు రోజులు ఏసీబీ అధికారుల బృందం వచ్చి దుర్గగుడిలోని అన్ని విభాగాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. పరిపాలన విభాగం, స్టోర్స్, చీరలు, ప్రసాదాల తయారీ, అన్నదానం, టిక్కెట్లు.. ఇలా ప్రతి విభాగానికి సంబంధించిన దస్త్రాలను లోతుగా పరిశీలించారు. చీరల విభాగం, అన్నదానం, సరకుల కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ.. ఇలా చాలా విభాగాల్లో అవకతవకలను గుర్తించారు.
వాటన్నింటికి సంబంధించిన నివేదికను తయారు చేసి దేవాదాయశాఖకు అందించారు. ఏసీబీ నివేదిక ఆధారంగా 15 మంది బాధ్యులైన సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు దేవాదాయశాఖ కమిషనర్ అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేశారు. కానీ సరిగ్గా నాలుగు నెలలు గడిచేసరికి సస్పెండ్ అయిన సిబ్బంది మొత్తం వచ్చి మళ్లీ కొలువుల్లోకి చేరిపోయారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈమాత్రం దానికి.. ఏసీబీ అధికారులు అంత హడావుడి చేస్తూ ఎందుకు సోదాలు చేయడం, నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వడం అనేది ప్రశ్నార్థకంగా మారింది.
దేవస్థానంలోని చీరల కౌంటర్లో రూ.70లక్షలకు పైగా పక్కదారి పట్టినట్టు గత ఈవో సురేష్బాబు హయాంలో గుర్తించారు. దానికి బాధ్యులైన సిబ్బందిపై తాత్కాలికంగా చర్యలు తీసుకుని వదిలేశారు. మళ్లీ సదరు సిబ్బంది హాయిగా విధుల్లో చేరిపోయారు. దేవస్థానానికి చెందిన ఆ డబ్బులు మాత్రం వెనక్కి రాలేదు.
గత మూడేళ్లలో ఇలాంటివి ఎన్నో...