దక్షిణ భారతావనికే తలమానికంగా విజయవాడ జవహర్ ఆటోనగర్ పేరుగాంచింది. ఆటోమొబైల్ నుంచి అన్ని రంగాల్లోనూ తయారీ కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. కార్మికుల వలసలు... మూతపడిన పరిశ్రమలు ఇలా ఒక సమస్య వెంట మరో సమస్య వెంటాడుతూనే ఉంది. ఆసియాలోనే అతి పెద్ద ఆటోనగర్గా ఆటోమొబైల్, వాహనాల విడిభాగాల తయారీ, అమ్మకాలకు ఇది నిలయం. బెజవాడ నగర శివారులో పారిశ్రామిక ఎస్టేట్ పక్కన దాదాపు 275 ఎకరాల స్థలంలో జవహర్ ఆటోనగర్ను 1966లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్థాపించారు. ఆటోమొబైల్కు సంబంధించిన అన్ని విడిభాగాలు, లారీ బాడీబిల్డింగ్కు సంబంధించిన యూనిట్లన్నీ ఒకే చోట ఉండటంతో దీనికి ‘ఆటోనగర్’ అని నామకరణం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ఆటోనగర్ అనే పేరు వాడుకలోకి వచ్చింది విజయవాడ ఆటోనగర్ నుంచే. ఆటోమొబైల్కు సంబంధించిన కార్పెంటర్, టింకరింగ్, వెల్డింగ్, టైర్ రీత్రెడ్డింగ్, పెయింటర్స్, ఇంజిన్ రీబోరింగ్, ఫ్యూయల్ ఇంజక్షన్, మెకానిక్ తదితర పనులతో వివిధ వృత్తుల వారు ఆటోనగర్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లారీలు, బస్సులకు బాడీలు కట్టడంలో ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఛేసిస్ వాహనాన్ని తీసుకొచ్చి, కార్మికులకు అప్పగిస్తే చాలు, యజమాని అభిరుచి మేరకు ఎలా కావాలంటే అలా బాడీలు కట్టి, అద్దంలా తయారు చేసి ఇస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన లారీ యజమానులు కూడా ఇక్కడికే వచ్చి లారీలకు బాడీలు కట్టించుకొని వెళ్తుంటారు. అలాంటి ఆటోనగర్ ఇప్పుడు పూర్తిగా వెలవెలబోతోంది. రోజువారీ కూలి దొరకడమే కార్మికులకు కష్టమవుతోంది. లెక్కలు కట్టి చూస్తే.. ఒకప్పటి కంటే ఇప్పుడిక్కడ 50 శాతం మంది కార్మికులే ఉంటే అందులో 25 శాతం మందికే పని ఉంది. కరోనా తెచ్చిన తంటాలతో ఆటోనగర్పై ఆధారపడి జీవిస్తున్న ఎందరో జీవితాలు తలకిందులు అయ్యాయి.
ఏడాది చివరి నెలల్లో ఆటోనగర్ అంతా కార్మికుల కష్టంతో తడిసి ముద్దయ్యేది. కొత్త సంవత్సరం ప్రారంభంలో, సంక్రాంతి సంబరంలో భాగంగా కొత్త బళ్లు తయారుచేయించుకునే వారితో బిజీగా ఉండేది ఈ ప్రాంతం. ఇప్పుడంతా మారిపోయింది. కరోనా వ్యాపారస్తులపైన అత్యధిక ప్రభావాన్ని చూపించింది. ఈ క్రమంలో మోటారు ఫీల్డు కూడా ఎంతో దెబ్బతింది. అన్ని విధాలా రేట్లు పెరిగిపోవడంతో వ్యాపారస్థుల మాట అటుంచితే కార్మికుల, కూలీల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆటోనగర్ లారీల యజమానులు ఇంకెవ్వరూ లారీలు తీసుకోవద్దని అందరికీ చెబుతున్నారు. ఇకపై ఇక్కడ లారీలు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి వాటిపై పెట్టుబడి పెట్టేవారూ తగ్గిపోయారు. తద్వారా మెకానిక్ షెడ్లు మూతపడుతున్నాయి. టైర్లు పంచర్లు వేసుకునే వారి దగ్గర నుంచి మెకానిక్లు, ఆటోమొబైల్స్కు సంబంధించిన వ్యాపారాలు, స్పేర్పార్ట్స్ వ్యాపారస్థులు, బాడీబిల్డింగ్ వర్కర్లు, పరదాలు-తాళ్లూ అమ్ముకునేవారు, ముఠా కార్మికులు... ఇలా చెప్పుకుంటూ పోతే... లారీలకూ, మోటారు ఫీల్డుకి అనుసంధానమైన విభాగాలన్నీ కుదేలవుతున్నా మొత్తంగా ఆటోనగర్లో అన్ని రకాలుగా సంక్షోభం తాండవిస్తోంది.