విజయవాడ నగరం.. జక్కంపూడి గ్రామ పరిధిలో నిర్మాణం చేస్తున్న ఇళ్లు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా దర్శనమిస్తున్నాయి. అసంపూర్తి నిర్మాణం, పునాదుల్లో కొన్ని ఉన్నాయి. నిర్మాణం పూర్తయి.. రంగులు వేసిన ఇళ్లు సాలీడులకు నివాసంగా మారాయి.
జిల్లాలో మాత్రం ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు. గుడివాడలో 1024 పూర్తయ్యాయి. మౌలిక వసతులైన నీటి సౌకర్యం, రోడ్లు, విద్యుత్తు ఇతర వసతులు కల్పించి కేటాయించనున్నారు. విజయవాడలో గత ప్రభుత్వంలోనే 8,300 మందికి ఇళ్లు కేటాయిస్తూ నగరపాలక సంస్థ లేఖలు అందజేసింది. కానీ ఇక్కడ 6576 మాత్రమే నిర్మాణంలో ఉన్నాయి. మిగిలినవి నిలిపివేశారు.
వేముల తిరుమల వాసు ముఠా కార్మికునిగా పని చేస్తున్నారు. విజయవాడ నగరం రాణిగారితోటలో నివాసం ఉంటున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి అద్దె నెలకు రూ.5వేలు చెల్లించాలి. కరోనాకు ముందు నెలకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం ఉండేది. ప్రస్తుతం రూ.10వేలు రావడం కష్టంగా మారింది. సొంత ఇంటి కోసం ఈయన రూ.25వేలు చెల్లించారు. మరో రూ.25వేలు చెల్లించలేకపోయారు. కానీ జక్కంపూడిలో ఇల్లు కేటాయించినట్లు అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు. కానీ ఇంతవరకు స్వాధీనం చేయలేదు.
ఇలాగైతే పాడైపోవా!
జక్కంపూడి గ్రామం పరిధిలో ప్రభుత్వం టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన బహుళ అంతస్తులు.. నిర్మాణం పూర్తయి ఏడాది దాటింది. అయితే లబ్ధిదారులకు ఇంతవరకు స్వాధీనం చేయలేదు. దీంతో పూర్తయిన ఫ్లాట్లు నిర్వహణ లేక చెత్తా చెదారంతో నిండిపోయాయి. మరికొన్ని పునాదుల్లోనే నిలిపివేశారు. మౌలిక వసతులు కల్పించలేదు. లబ్ధిదారులు రూ.50వేలు చొప్పున వాటా కట్టారు. ప్రస్తుతం వీరంతా నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో అఫర్డబుల్ హౌసింగ్ స్కీం (ఏహెచ్పీ) కింద 27,872 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. గతేడాది పైకప్పు వరకు పూర్తి చేసినవి 14,751 ఉన్నాయి. అప్పటినుంచి వాటి పనులు నిలిచిపోయాయి. నందిగామలో 240 ఇళ్లు పూర్తయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. గుడివాడలో దాదాపు 1024 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. విజయవాడ జక్కంపూడి కాలనీలో 55వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలనేది లక్ష్యం. 8300 మందికి కేటాయింపు పత్రాలు అందజేశారు. 3వేల గృహాలు నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చాయి. ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు రూ.4,677.11 కోట్లతో ఈ ఏహెచ్పీ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాలను నిలిపివేసి రివర్స్ టెండర్లను పిలిచింది. గుడివాడ, మచిలీపట్నంలో రివర్స్ టెండర్లను ఆమోదించారు.
లబ్ధిదారుల్లో ఆందోళన..!