ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యుద్ధ వాతావరణంలో ఉక్కిరిబిక్కిరవుతు స్వదేశానికి వచ్చేందుకు అగచాట్లు పడుతున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన సుబ్రహ్మణ్యం, మల్లీశ్వరీల కుమార్తె అఖిల, చినగంజాం మండలం రాజుబంగారుపాలెంకు చెందిన కల్లూరి జయప్రతాప్ ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. వారు ఉండే చోట పరిస్థితి బాగానే ఉన్నా.. భయంభయంగా గడుపుతున్నట్లు ఫోన్ ద్వారా వివరించారు. వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉన్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారిని భారత్కు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేపడుతోందన్నారు.
గుంటూరు జిల్లా నుంచి 48 మంది విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్లినట్లు.. అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి.. రుమేనియా, పోలండ్ దేశాలకు వెళ్లడానికి కొంతమందిని అక్కడ బస్సుల్లో పంపించారు. కానీ ఎయిర్పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో విద్యార్థులను దించేస్తున్నారు. మోయలేని లగేజీతో చాలామంది నరకయాతన అనుభవిస్తూ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. మరికొందరిని రుమేనియా, పోలండ్ సరిహద్దులో ఆపేస్తున్నారు. సరిహద్దుల్లో వేల మంది రోడ్లపై ఉండిపోయారని.. వారిలో తమ స్నేహితులూ ఉన్నట్లు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థులు తెలిపారు. తొందరపడి సరిహద్దులోకి రావొద్దని వారు సూచించినట్లు లిఖిత అనే తెలుగు విద్యార్థిని వెల్లడించింది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంకు చెందిన రాజేష్ కుమారుడు షణ్ముఖేశ్వర్ ఉక్రెయిన్లోని మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. షణ్ముఖేశ్వర్ తాను ఉంటున్న ప్రాంతాన్ని అక్కడి పరిస్థితులను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేశాడు. ప్రధాన పట్టణానికి చేరువలో ఉన్న వారిని మాత్రమే భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోందన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. కుమారుడికి తల్లిదండ్రులు, కన్నవారికి తనయుడు ధైర్యం చొప్పుకుంటున్నారు. తమ ఒక్కగాని ఒక్క కుమారుడైన షణ్ముఖేశ్వర్ను త్వరగా తమ వద్దకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.