ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2021, 8:38 PM IST

Updated : Jul 9, 2021, 9:51 PM IST

ETV Bharat / city

AP-TS Water Disputes: పులిచింతలలో మరోసారి విద్యుదుత్పత్తి పెంచిన తెలంగాణ

AP-TS Water Disputes
పులిచింతలలో మరోసారి విద్యుదుత్పత్తి పెంచిన తెలంగాణ

20:34 July 09

పులిచింతలలో మళ్లీ విద్యుదుత్పత్తి పెంచిన తెలంగాణ

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న తరుణంలో..తెలంగాణ ప్రభుత్వం పులిచింతలలో మరోసారి విద్యుదుత్పత్తిని పెంచింది. 4 యూనిట్ల ద్వారా టీఎస్ జెన్​కో విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 60 మెగావాట్లకు పైగా ఉత్పత్తి జరుగుతోందని పులిచింతల అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తితో 14,250 క్యూసెక్కుల నీరు వృథాగా పోతుంది. 

తారాస్థాయికి వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణాజలాల వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. కేంద్రం, కోర్టులు, ట్రైబ్యునళ్లు, బోర్డు.. ఇలా అన్నింటిలోనూ ప్రస్తుతం ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. విద్యుదుత్పత్తి, రాయలసీమ ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి, కృష్ణాబోర్డు సమావేశం.. ఇలా అన్ని అంశాలపైనా పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ కోరింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర పర్యావరణ అనుమతి మదింపు కమిటీకి లేఖ రాశారు. ఈ పథకం అటవీప్రాంతంలో కానీ, వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో కానీ లేదని, పర్యావరణ అనుమతి ఇవ్వాలని సీఎం జగన్‌ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రికి లేఖ రాయగా, అది వన్యప్రాణి ప్రాంతంలోనే ఉందంటూ అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ తన లేఖలో జతచేసింది.

తెలంగాణ వాదన..

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీయే అనధికార ప్రాజెక్టు అని, దానికి జలసంఘం అనుమతి లేదని, అలాంటిది దాని విస్తరణ కోసం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు అనుమతి ఎలా ఇస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది.

జగన్ లేఖ..

నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తోందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల అనధికార ప్రాజెక్టు అని, దానికి శ్రీశైలంలో 800 అడుగుల మట్టం నుంచి నీటిని తీసుకుంటారని, ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల తప్ప ప్రత్యామ్నాయం లేదని, అనుమతి ఇవ్వాలని సీఎం జగన్‌ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ అనధికారికంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తోందని, కల్వకుర్తి, ఎస్‌.ఎల్‌.బి.సి. విస్తరణ చేపట్టిందని, దానిపై చర్యలు తీసుకోవాలని జగన్‌ కేంద్ర జల్‌శక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ట్రైబ్యునల్‌లో పిటిషన్‌

రాయలసీమ పథకం పనులు నిలిపివేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించినా..ఏపీ వాటిని కొనసాగిస్తుందని ధిక్కరణ చర్య తీసుకోవాలని ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రైబ్యునల్‌ స్వయంగా పనులను పరిశీలించాలని కోరుతూ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, హెలికాప్టర్‌ సమకూర్చుతామని తెలిపింది. పర్యావరణ అనుమతి లేకుండానే ఏపీ 1500 మంది కార్మికులతో పనులు చేయిస్తోందని, ట్రైబ్యునల్‌ ఆదేశం మేరకు కృష్ణాబోర్డు అధికారులు పరిశీలనకు వస్తామంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ అధికారులు హెచ్చరిస్తున్నారని పేర్కొంది.

రెండు టీఎంసీలు.. సముద్రంలోకి

జూరాలకు ప్రవాహం తగ్గడంతో అక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేసి ఎత్తిపోతల పథకాలు, కాలువలకు నీటిని విడుదల చేసిన తెలంగాణ..శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో మాత్రం విద్యుదుత్పత్తి కొనసాగిస్తోంది. తద్వారా సముద్రంలోకి నీరు వృథాగా పోతుంది. 

ఇదీ చదవండి

Rayalaseema Lift Irrigation Project: కేంద్ర పర్యావరణ శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Last Updated : Jul 9, 2021, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details