ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 6, 2020, 5:51 PM IST

ETV Bharat / city

'ఈజ్ ఆఫ్ డూయింగ్​లో నెంబర్ వన్ ఘనత చంద్రబాబుదే'

సులభతర వాణిజ్యంలో రాష్ట్రానికి ప్రథమ స్థానం రావడం తమ ఘనతేనంటూ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కృషి వల్లే రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చిందన్నారు. 2019 మార్చి 20కి ముందు నాటి సులభతర వాణిజ్య విధానాలకు అవార్డులు ఇస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా ప్రకటిస్తే ఆ విషయం కూడా తెలియకుండా మంత్రులు మాట్లాడుతున్నారని తెదేపా నేతలు విమర్శించారు.

tdp leaders on ease of doing business
tdp leaders on ease of doing business

సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్​కు ప్రథమ స్థానం దక్కడం తమ ఘనతేనంటూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం జగన్ కు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో నెంబర్ 1.. వస్తే.. అప్పుడు జగన్ నోరుపారేసుకున్నారని.. గుర్తుచేశారు. ఇప్పుడు అదే నోటితో వైకాపా పాలనలో వచ్చిన ర్యాంకింగ్ కాకపోయినా తన పనితనం చూసే ఏపీకి లో నెంబర్ 1 ఇచ్చినట్లు, తాటికాయంత అక్షరాలతో సొంత మీడియా లో ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం రాలేదన్న జగనే.. తెదేపా పాలనలో 39,450 పరిశ్రమలు, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయన్నది ఒప్పుకోవాల్సి వచ్చిందని లోకేశ్ విమర్శించారు.

సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ర్యాంకు తెదేపా ప్రభుత్వ ఘనతేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి వల్లే సులభతర వాణిజ్యంలో ఏపీకి ర్యాంకు వచ్చిందన్నారు. వైకాపా అధికారంలో వచ్చాక చేసింది సున్నానని విమర్శించారు.

విద్వేషాలు, పునాదులపై నిర్మితమైన జగన్ అధికారం ఆంద్రప్రదేశ్ ను అధోగతి పాలు చేసిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. 15 నెలల కాలంలో ఏపీకి ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా? అని నిలదీశారు. ఒక్క ఉద్యోగమైనా కల్పించారేమో ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. పెండింగ్ పారిశ్రామిక రాయితీలు తాము చెల్లించినట్లు జగన్ గొప్పలు చెప్పుకోవడం పచ్చి అబద్ధమన్నారు.

సులభతర వాణిజ్య విధానాలు, సంస్కరణలు అంటే ఏమిటో వైకాపా ప్రభుత్వానికి తెలుసా అని బండారు సత్యనారాయాణమూర్తి నిలదీశారు. చంద్రబాబు కృషిని తమదిగా చెప్పుకుంటున్న జగన్, ముందు తన ఆర్థిక నేరాల సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రయ్యాక ఒక్క పరిశ్రమనైనా రాష్ట్రానికి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

చైనా ఆశలు రెండు గంటల్లోనే ఆవిరి!

ABOUT THE AUTHOR

...view details