తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టును పార్టీ శ్రేణులు ఖండించాయి. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే సీఎం జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైకాపా అవినీతిని ప్రశ్నించినందుకు అరెస్టులు చేయడం దారుణమని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఎంపీ రామ్మోహన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో కింజరాపు కుటుంబానికి ఉన్న ఆదరణను చూసి జీర్ణించుకోలేక వైకాపా ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
అచ్చెన్నను 24 గంటల్లోగా విడుదల చేయాలి: తెదేపా నేతలు - tdp leaders fires on achennaidu arrest
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్టును తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అచ్చెన్నపై ఉన్న తప్పుడు కేసులను ఎత్తేయాలన్నారు. అక్రమ అరెస్టుకు సీఎం జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నేతలు హెచ్చరించారు.
![అచ్చెన్నను 24 గంటల్లోగా విడుదల చేయాలి: తెదేపా నేతలు tdp leaders fires on ysrcp government on achennaidu arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10471631-601-10471631-1612259931448.jpg)
వైకాపా అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్టు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. విజయసాయిరెడ్డి నిమ్మాడ వెళ్లేందుకు అనుమతి ఇస్తే.. తనకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. నిమ్మాడలో జరిగిన ఘటనలు డీజీపీకి కనిపించడం లేదా అని వర్లరామయ్య నిలదీశారు. అచ్చెన్నాయుడుని బేషరతుగా 24 గంటల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: అచ్చెన్నాయుడికి రెండు వారాల రిమాండ్ విధింపు