ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే.. దేవుడు కూడా క్షమించడు"

By

Published : Mar 4, 2022, 12:45 PM IST

Updated : Mar 4, 2022, 5:59 PM IST

TDP leaders fires on CM: అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుతోనైనా.. సీఎం జగన్ మొండిపట్టు వీడాలని తెదేపా నేతలు సూచించారు. అనవసరంగా పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని హితవు పలికారు.

tdp leaders fires on CM Jagan over amaravati issue
రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకుంటే దేవుడు కూడా క్షమించడు: తెదేపా

TDP leaders fires on CM: రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్.. మొండిపట్టు వీడాలని తెదేపా నేతలు అన్నారు. ఇప్పటికీ మొండితనం వీడకుంటే భగవంతుడు కూడా క్షమించడని హెచ్చరించారు. అనవసరంగా పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని హితవు పలికారు.సహజ న్యాయం చెల్లుబాటు కోసం భూములిచ్చిన రైతులు.. 800రోజులకు పైగా పోరాడాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు వచ్చి 24 గంటలైనా ముఖ్యమంత్రి ఇంకా స్పందించకపోవడాన్ని వారు తప్పుబట్టారు.

రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు: సోమిరెడ్డి
హైకోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి.. మొండిపట్టు వీడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. అమరావతి పై ప్రభుత్వం నిర్ణయం ఇకనైనా తీరు మార్చుకోకుంటే భగవంతుడు కూడా క్షమించడని హెచ్చరించారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు కానీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దని హెచ్చరించారు.

మహిళలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆగ్రహం
హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి మహిళలను అభినందించేందుకు.. తెదేపా నేత వంగలపూడి అనిత మందడం శిబిరానికి వచ్చారు. మహిళలు వంటింటి కుందేళ్లు కాదని అమరావతి మహిళలు నిరూపించారని కితాబిచ్చారు. గతేడాది మహిళా దినోత్సవం రోజున వైకాపా ప్రభుత్వం మహిళలను అవమానించిందన్నారు. ఉద్యమంలో మహిళలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. సిగ్గు, నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో.. మహిళలే జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు.

అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు: దేవినేని ఉమా
సీఆర్‌డీఏ చట్టాన్ని పకడ్భందీగా రూపొందించడం వల్లే అమరావతి రైతులకు హైకోర్టులో న్యాయం జరిగిందని.. తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మందడంలోని దీక్షా శిబిరం వద్ద కృతజ్ఞతసభ నిర్వహించారు. అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారా అని మాజీ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజా వేదికను కూల్చినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారని.. కానీ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని ఎవరూ ఊహించలేదన్నారు. త్వరలోనే ఈ అరాచకానికి ముగింపు ఉంటుందని హెచ్చరించారు.

అసమర్ధ ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారు: నక్కా ఆనంద్ బాబు
రాష్ట్ర చరిత్రలో అసమర్ధ ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజధాని గ్రామాలతో పాటు ఐదు కోట్ల ఆంధ్రులు పండుగ చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులకు.. కోర్టులన్నా, చట్టాలన్నా గౌరవం లేదని అందుకే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు.

కమ్యూనిస్టులతో కూడా కొబ్బరికాయ కొట్టించింది: రామకృష్ణ
అమరావతి ఉద్యమం కమ్యూనిస్టులతో కూడా కొబ్బరికాయ కొట్టించిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అమరావతి మహిళలకు భయపడి జగన్ తన చుట్టూ వందలాది మంది పోలీసులను పెట్టుకుని బయటకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. హైకోర్టు తీర్పు వచ్చాక కూడా మంత్రులు మాట్లాడుతున్న మాటలు సరికావన్నారు. మళ్లీ కొత్త చట్టం తెస్తామని కోర్టులతో కొట్లాడుతామని చెప్పడం తప్పుబట్టారు.

High Court Verdict on Amaravati:ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు ప్రధానాంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం శాసనసభకు లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 58కి లోబడి అమరావతి రాజధాని నగరం, ఆ ప్రాంతంలో రహదారులు, తాగునీరు, డ్రైనేజి, విద్యుత్‌ తదితర మౌలిక సదుపాయాలను నెల రోజుల్లో కల్పించాలని ఆదేశించింది. సెక్షన్‌ 61 ప్రకారం రాజధానిలోని టౌన్‌ ప్లానింగ్‌ స్కీమ్‌ (నవ నగరాలు) పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందే..
రాజధాని కోసం భూములిచ్చిన యజమానులు, రైతులకు మౌలిక సదుపాయాలన్నీ కల్పించి, నివాసయోగ్యంగా ప్లాట్లను సిద్ధం చేసి మూడు నెలల్లోగా అప్పగించాలని నిర్దేశించింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించాలని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తేల్చిచెప్పింది.

రాజధాని కోసం సమీకరించిన భూములను రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంత అభివృద్ధికి తప్ప.. తాకట్టు పెట్టడానికి, వాటిపై మూడో వ్యక్తి (థర్డ్‌ పార్టీ)కి హక్కులు కల్పించొద్దని స్పష్టం చేసింది. అమరావతిలో అభివృద్ధి పనులపై పురోగతిని తెలియజేస్తూ ప్రత్యేకంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టంగా నిర్దేశించింది. వీటన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వానికి, సీఆర్‌డీఏకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సమస్యలను కారణాలుగా చూపుతూ అమరావతిలో నిర్మాణాలు చేపట్టలేమంటే కుదరదని కుండబద్దలు కొట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. మరోవైపు రాజధానిలోని కార్యాలయాల తరలింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అమల్లోనే ఉంటాయని స్పష్టం చేసింది.

సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాలను సవాలు చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు, ఎస్‌.మురళీధర్‌రెడ్డి, మండల రమేశ్‌, గిరిబాబు తదితరులకు 17 వాజ్యాల్లో ఒక్కోదానికి రూ.50 వేల చొప్పున మొత్తం 8.5 లక్షలు ఖర్చులు కింద చెల్లించాలని ఆదేశించింది. రాజధాని బృహత్తర ప్రణాళికను సీర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా సవరించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌, ఉన్నతస్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలను తగిన సమయంలో పిటిషనర్లు సవాలు చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చింది. అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ శాసనం చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను పెండింగ్‌లోనే ఉంచింది.

ఇదీ చదవండి:

రాజధాని అమరావతే... మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: హైకోర్టు

Last Updated : Mar 4, 2022, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details