జాబ్ క్యాలెండర్ను నిరసిస్తూ.. విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రేపు(ఈనెల19) సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. నిరుద్యోగులకు మద్దతుగా 'చలో తాడేపల్లి'(Chalo Thadepalli)కి తెదేపా పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ సంఘాల నాయకులతోపాటు తెదేపా, టీఎన్ఎస్ఎఫ్, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి.
అనంతపురంలో..
చలో తాడేపల్లి నేపథ్యంలో అనంతపురం తెదేపా పార్లమెంట్ ఇన్ఛార్జీ జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని లక్ష్మీ నగర్లో ఇంటి వద్ద కార్యకర్తలతో కలిసి సీఎం కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతుండగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆయనతోపాటు కొంతమంది కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
చంద్ర దండు నాయకులు అరెస్టు..
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని చంద్ర దండు నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా ఛలో సీఎం కార్యాలయానికి బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడును అనంతపురంలో 4వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇతర నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్లోనే నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.
విజయవాడలో...
అన్నీ ఖాళీలతో నూతన క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్తో చలో తాడేపల్లికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దీంతో రెండు రోజుల ముందు నుంచే విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేశారు. తమకు పరీక్షలు ఉన్నాయని చెప్పినా వినకుండా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారని రాష్ట్ర ఉద్యోగ పోరాట సమితి నాయకులు లెనిన్ బాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత మందిని అరెస్టు చేసిన చలో తాడేపల్లి నిర్వహించి తీరుతామని లెనిన్ బాబు స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా ఆత్మకూర్లో తెదేపా, టీఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ముట్టడికి బయలుదేరిన టీఎన్ఎస్ఎఫ్(TNSF) నాయకులను ఆత్మకూర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించిన తిరుపతి నాయుడు, మోహన్, రవి, తదితరులు.. చంద్రబాబు జిందాబాద్.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేయగా.. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.
కడపలో..
చలో తాడేపల్లి కార్యక్రమానికి వెళ్తున్న విద్యార్థి సంఘ నాయకులను కడప పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులను కడప రైల్వే స్టేషన్లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ అన్నారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 10 వేల ఉద్యోగాలను విడుదల చేయడం నిరుద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.