విద్యార్థులు కరోనా బారిన పడితే బాధ్యత ఎవరిది?: అయ్యన్న - సీఎం జగన్ తీరుపై అయ్యన్న మండిపాటు
పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వీడి మానవత్వంతో ఆలోచించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.

పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం వీడి మానవత్వంతో ఆలోచించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. కరోనా భయంతో అసెంబ్లీ, తిరుపతి ఉపఎన్నిక ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నారని, ప్రాణాలు తనవి మాత్రమే, విద్యార్థులవి కావన్నట్లుగా మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ సహచరుల ప్రాణాలు పోతుంటే ఉపాధ్యాయ సంఘాలు.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఎందుకు తిరస్కరించట్లేదని ఆక్షేపించారు. సీఎం, విద్యాశాఖ మంత్రి, మూర్ఖంగా ఉంటే, సీనియర్ మంత్రులు నచ్చచెప్పరా అని నిలదీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడితే బాధ్యత ఎవరదని అయ్యన్న ప్రశ్నించారు. కరోనా వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలో, చికిత్స ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.