ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యం.. రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదు: అనగాని - సీఎం జగన్​పై తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపాటు

వైకాపా ప్రభుత్వంలో గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యం.. రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అమరావతికి ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్.. రైతులు దీక్షలు చేస్తున్నా ఇప్పుడెందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. చంద్రబాబు పాలనలో ప్రజలెన్నడూ రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహించలేదన్నారు.

tdp leader anagani satyaprasad fires on cm jagan and his works
గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యత.. రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదు: అనగాని

By

Published : Mar 21, 2021, 12:23 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అరాచకానికి, గూండాయిజానికి ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్రాభివృద్ధికి ఇవ్వడం లేదని.. తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.

రైల్వే జోన్ ఉసే లేదు

పార్లమెంటులో వైకాపా ఎంపీలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. సీఎం జగన్.. రాజధాని పేరు ప్రస్తావించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రం వైకాపా దుష్ట్ర శక్తులు చేతిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోందని దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదా సంగతేంటి..?

కేంద్రం మెడలు వంచైనా.. ప్రత్యేక హోదా తెస్తామన్న వైకాపా ఎంపీలు.. ఇప్పుడెందుకు తలలు దించుకుంటున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి హోదా వచ్చింది కాబట్టే.. రాష్ట్రానికి హోదా అవసరం లేదనుకుంటున్నారని విమర్శించారు. హోదా తెచ్చి ప్రతి గ్రామాన్ని మరో హైదరాబాద్ చేస్తానన్న విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. రాష్ట్రాభివృద్దికి బదులు.. వైకాపా అభివృద్దికే జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు పాలనలో ప్రజలు ఏనాడు రోడ్లెక్కలేదు

చంద్రబాబు పాలనలో ఏనాడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని.. హింసాంత్మక ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. చంద్రబాబు సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించుకొని ముందుకెళ్తే.. జగన్ ప్రభుత్వం సంక్షోభాలు సృష్టించి అమరావతిని, రాష్ట్రాభివృద్దిని నిలిపివేసిందని ధ్వజమెత్తారు. హోదా వద్దు.. యువతకు ఉద్యోగం వద్దు.. వివక్ష పాలనే ముద్దు అన్నట్లుగా జగన్ రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు.

ఒక్క నోటిఫికేషన్​ కూడా ఇవ్వలేదు

రెండేళ్లుగా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా.. నిరుద్యోగులను వంచిస్తున్నారన్నారు. పోలవరాన్ని అధోగతి పాలు చేసి రైతులను సంక్షోభంలోకి నెట్టారని దుయ్యబట్టారు. రాజధానిలో 90 శాతం పరిపాలన భవనాలు పూర్తైనా.. వాటిని పక్కనపెట్టేశారని ధ్వజమెత్తారు. అమరావతికి భూములిచ్చిన రైతులను.. 460 రోజులుగా వేధిస్తున్నారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు.

స్వచ్చందంగానే భూములిచ్చారు

రాజధానిలో అక్రమాలు జరిగాయంటూ ఇప్పటి దాకా నలుగురు వైకాపా నేతలతో కేసులు వేయించిన జగన్‌.. నిరూపించింది మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. స్వచ్ఛందంగానే భూములిచ్చామని, లబ్ధి కూడా పొందామని రైతులు చెప్తున్నారని.. దానికి వైకాపా నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.122 మంది రైతులు, కూలీలు మనోవేధనతో చనిపోతే ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు.

సీఎంపై సీఐడీ కేసు పెట్టాలి

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగామాడుతున్న వైకాపా ప్రభుత్వంపై.. సీఐడీ కేసు నమోదు చేయాలని అనగాని డిమాండ్‌ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాది నిజమైన గెలుపుకాదని విమర్శించారు. ఈ నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారని హెచ్చరించారు.

అనగాని సత్యప్రసాద్ విడుదల చేసిన పత్రికా ప్రకటన
అనగాని సత్యప్రసాద్ విడుదల చేసిన పత్రికా ప్రకటన

ఇదీ చదవండి:

అప్పుడూ జోక్యం చేసుకునే అధికారం లేదని చెప్పగలరా..?: హైకోర్టు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details