కరోనా సోకి మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. స్టెరాయిడ్లను వాడి కొవిడ్ బాధితుల ఆయువును నిలబెట్టవచ్చని శ్వాసకోశ వ్యాధి నిపుణులు రఘురాం చెబుతున్నారు. వైరస్ ప్రభావం తక్కువగా ఉండే సమయంలోనే ఈ స్టెరాయిడ్లను ఇస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్నారు. కృష్ణా జిల్లాలో వీటిని ప్రయోగాత్మకంగా వాడి మరణాల రేటును గణనీయంగా తగ్గించామని వైద్యుడు రఘురాం వివరించారు.
'స్టెరాయిడ్లు.. ప్రణాళికబద్ధంగా వాడి ప్రాణాలు కాపాడవచ్చు'
కరోనా చికిత్సలో స్టెరాయిడ్లు సంజీవని పాత్ర పోషిస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రణాళికబద్ధమైన చికిత్సతో కొవిడ్ మరణాలు తగ్గించవచ్చంటున్నారు. హోం ఐసోలేషన్లో ఉంటూ.. సొంతంగా మందులు వాడటం వల్లే కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు.
!['స్టెరాయిడ్లు.. ప్రణాళికబద్ధంగా వాడి ప్రాణాలు కాపాడవచ్చు' Steroids can be used in a planned way to save lives](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8705577-198-8705577-1599426911832.jpg)
డెక్సామెథసోన్, మిథైన్ ప్రెడ్నిసొలోన్ వంటి స్టెరాయిడ్లను ప్రణాళికబద్ధంగా అందిస్తే... చక్కని ఫలితాలు ఉంటాయని వైద్యుడు రఘురాం తెలిపారు. మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ స్టెరాయిడ్ల వాడకం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నా.. అంత ప్రమాదకరం కాదన్నారు. కరోనా బాధితులకు అందించే చికిత్సతో పాటు ఆహార అలవాట్లూ కీలకపాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు