ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడేళ్లుగా పాత బస్సులతోనే నెట్టుకొస్తోన్న ఆర్టీసీ... కొత్తవి రోడ్డెక్కేదెప్పుడు..? - no new buses in ap

APSRTC: ప్రజల అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తేనే రవాణా సంస్థలకు ఆదరణ పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో లాభాలూ వస్తాయి. ఎంతో పేరుగాంచిన ఏపీఎస్​ఆర్టీసీ మాత్రం ఆ దిశగా నడవడం లేదు. ఏటా 2 వేల కొత్త బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉండగా.. ప్రభుత్వం నుంచి సాయం రాక పాత బస్సులతోనే నెట్టుకొస్తోంది. అంతే కాకుండా సొంత బస్సులుకున్నా... అద్దెబస్సుల సంఖ్యను పెంచడంపైనే దృష్టి సారించడం విమర్శలకు తావిస్తోంది.

APSRTC
APSRTC

By

Published : Mar 14, 2022, 4:28 AM IST

మూడేళ్లుగా పాత బస్సులతోనే నెట్టుకొస్తోన్న ఆర్టీసీ

RTC: ఆర్టీసీలో ఉన్న 11 వేల 439 బస్సుల్లో సంస్థ సొంత బస్సులు 9వేల 89 కాగా.. మిగిలిన 2వేల299 అద్దె బస్సులే. గతంలో అద్దె బస్సులు కన్నా.. సొంత బస్సులకే ప్రాధాన్యత ఉండేది. కానీ క్రమంగా అద్దె బస్సుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 10 లక్షల కిలోమీటర్లు కంటే ఎక్కువ తిరిగిన బస్సులు.. ప్రయాణికుల తరలింపునకు పనికిరావు. డొక్కు బస్సులను పక్కన పెట్టి వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉంది. గతంలో ఏటా 2 వేల కొత్త బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించేది. అనేక రూట్లలో కొత్త బస్సులు రావడం వల్ల బస్సు ప్రయాణానికి జనం ఆసక్తి కనపరిచేవారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో మూడేళ్లుగా కొత్త బస్సుల ఊసేలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్న బస్సులకే కొత్తగా రంగులద్ది ఆర్టీసీ తిప్పుతోంది.

ఆర్టీసీలో 10 లక్షల కిలోమీటర్లు చేరువైన పల్లె వెలుగు బస్సులు 4 వేలపైనే ఉన్నాయి. వీటిని మరికొద్ది రోజుల్లో పక్కన పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ బస్సులకే ఇంజిన్లు మరమ్మతులు చేసి బాడీలు మార్చుతూ కొత్త బస్సులుగా మార్చుతున్నారు. దీని కోసం ఒక్కో బస్సుకు 2 లక్షల వరకు వెచ్చించి రోడ్డెక్కిస్తున్నారు. వాటి కాలపరిమితి దాటడంతో బ్రేకులు, ఇంజిన్ ఫెయిలై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సులు కొనుగోలుకు ఆర్టీసీ ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదనేది అధికారుల మాట.

అద్దె బస్సుల వల్ల నిర్వహణ వ్యయం తగ్గడంతోపాటు సిబ్బంది నియామకం చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇది లాభదాయకమని ఆర్టీసీ అంటోంది. కానీ అద్దె బస్సులు పెరగడం వల్ల సుశిక్షితులైన డ్రైవర్లు లేక ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:CJI: శ్రీశైలం మల్లన్న సేవలో సీజేఐ ఎన్వీ రమణ

ABOUT THE AUTHOR

...view details