ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, రాష్ట్రీయ సేవాసమితి స్థాపకుడు పద్మశ్రీ గుత్తా మునిరత్నం (85) కన్నుమూశారు. కరోనా సోకడంతో చెన్నైలో మెరుగైన వైద్యం కోసం వెళ్లిన ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మునిరత్నం మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందరో అనాథలను ఆదుకోవటంతో పాటు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయటంతో పాటు లక్షలాది నిరుద్యోగులకు స్వయం ఉపాథి శిక్షణకు చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఎన్నో విలువలున్న ఆదర్శవంతుడని కోల్పోయామని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
మునిరత్నం ప్రస్థానం..
తిరుపతిలో రాష్ట్రీయ సేవాసమితి పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించిన మునిరత్నం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2500 వెనుకబడిన గ్రామాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 1936 జనవరి 6 న అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని తిరువళ్లూరు జిల్లా సీతాపురంలో జన్మించారు. ఎన్జీరంగా, నిర్మలా దేశ్ పాండే స్ఫూర్తితో గాంధేయ మార్గంలో నడిచారు.