హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి తరలి వచ్చిన సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు హెచ్ఆర్ఏ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ నుంచి తరలివచ్చి విజయవాడ, గుంటూరులలో అద్దె ప్రాతిపదికన నివాసం ఉంటున్న ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. హైదరాబాద్ నుంచి తరలిరాని ఉద్యోగులకు, నూతనంగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి, డెప్యుటేషన్పై వచ్చిన వారికి ఇంటి అద్దె భత్యం ఉత్తర్వులు వర్తించవని వెల్లడించింది.
ప్రభుత్వ పెన్షనర్లకు డీఏ పెంపు
రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షర్లకు 3.144 శాత మేర డీఏ పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన కరవు భత్యాన్ని 2019 జనవరి 1 నుంచి వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పెంపుతో 33.536 శాతానికి పెరిగిన పెన్షనర్ల కరవు భత్యం చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బకాయి ఉన్న డీఏను వాయిదాల్లో చెల్లించనున్నట్లు తెలియజేసింది.