ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్‌ను వీడని ముసురు.. తెలంగాణలో భారీ వర్షాలు - Today Weather Report latest news

Rains in telangana Today: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. రోడ్లపై నీరు, బురద చేరడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెరువులకు, రోడ్లకు గండి పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల రెండు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

rains
rains

By

Published : Sep 11, 2022, 8:10 PM IST

హైదరాబాద్‌ను వీడని ముసురు.. తెలంగాణలో భారీ వర్షాలు

Rains in telangana Today: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భాగ్యనగర వాసులను వర్షం భయం వెంటాడుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న చిరుజల్లులతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన పాదచారులు, ద్విచక్రవాహనదారులు చిరు జల్లులకు తడిసిముద్దవుతున్నారు. గ్యాప్‌ లేకుండా పడుతున్న జల్లులకు రహదారులన్నీ చిత్తడిగా మారాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటలకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపారు. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న 24గంటల్లో దక్షిణ ఒడిస్సా, దక్షిణ చత్తీస్‌గఢ్‌ మీదుగా వెళుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

వాగులో కారు కొట్టుకు పోయి ఇద్దరు మృతి: వేములవాడ మండలంలోని ఫాజుల్‌నగర్ వాగులో కారు కొట్టుకు పోయి ఇద్దరు మృతి చెందారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు నలుగురు కారులో వెళ్తుండగా వాగు ఉద్ధృతిని అంచనా వేయలేక ఈ ప్రమాదం జరిగింది. కారు మునగటంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరిని పోలీసులు రక్షించారు. సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి సిరిసిల్ల పట్టణ ప్రాంతమంతా జలమయమైంది.

అధికారులు నీటిని జేసీబీలతో మధ్యమానేరులోకి మళ్లిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు ప్రకటన విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరకాల చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు అలుగు పోస్తుంది. శాయంపేట మండలం జోగంపల్లి ప్రాజెక్టు చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

పలు జిల్లాలో ఎడతెరపిలేని వర్షం: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. భూగర్భ జలాల నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చెరువులు కుంటలు అలుగులు పోస్తున్నాయి.

బోధన్ తపాలా కార్యాలయంలోకి చేరిన వరద: తపాలా కార్యాలయానికి ఉత్తరాలు బట్వాడా అవుతుంటాయి. కానీ నిజామాబాద్ జిల్లా బోధన్ తపాలా కార్యాలయానికి మాత్రం వానాకాలమొస్తే వరద.. వరదతో పాటు బురద బట్వాడా అవుతుంటాయి. వర్షం పడితే కార్యాలయంలోకి భారీగా నీరు చేరుతుంది. నిజాం కాలంలో నిర్మించిన భవనం కాబట్టి ప్రస్తుతం నిర్మించిన రహదారులు, డ్రైనేజీలు దీనికంటే ఎత్తులో ఉన్నాయి. లోతట్టుగా ఉండటంతో కార్యాలయంలోకి వరద దూసుకొస్తోంది. నాయకులు స్పందించి తక్షణమే సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ రహదారిపై భారీ గుంత: భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం బతుకమ్మ వాగు సమీపంలోని జాతీయ రహదారిపై భారీ గుంత ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం 63వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలను నిషేధించారు. మంచిర్యాల వైపు నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశాలున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details