ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బతుకు బండికి బ్రేకులు పడ్డాయి

By

Published : Jun 4, 2020, 4:55 PM IST

వారంతా రోజువారీ కూలీలు .. రైలు బండి నడిస్తేనే వారి బతుకు బండి నడుస్తుంది. పట్టాలపై చక్రాలు పరుగులు పెడితేనే వీరి జీవన చక్రం సాఫీగా సాగుతుంది. ప్రయాణికుల ఇచ్చే పదో పరకో వీరికి జీవనాధారం. రోజువారీ కూలీతోనే పూటగడుపుకోవాలి. అరకొరగా జీవనం సాగే ఆ కూలీల కుటంబాల్లో కరోనా కల్లోలం నింపింది... కరవు పాలు చేసింది. రెండు నెలలుగా రైల్వే స్టేషన్లు మూతపడటంతో... కూలీల పరిస్ధితి దారుణంగా తయారైంది. కరోనా బారిన పడిన అందరినీ ఆదుకున్నా... తమను మాత్రం ఎవరూ పట్టించుకోక పోవడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

railway workers problems due to lock down affect
బతుకు బండికి బ్రేకులు పడ్డాయి

బతుకు బండికి బ్రేకులు పడ్డాయి

రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సామ్లాన్లను మోయడమే వీరి జీవనాధారం. దీనికోసం వీరికి ప్రత్యేకంగా యూనిఫాం సహా లైసెన్సులను రైల్వే శాఖ జారీ చేసింది.

  • వారిచ్చే కొంత మొత్తమే వీరికి ఆధారం..

ఎప్పుడూ ర్వైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉండే వీరంతా.. ప్రయాణికులకు సాయం చేస్తుంటారు. ప్రయాణికుల లగేజీ మొత్తాన్ని తలపై పెట్టుకుని.. మరికొన్నింటిని, భుజానికి తగిలించుకునే మోత మోస్తూ ప్రయాణికులను రైలు ఎక్కిస్తుంటారు. రైలుదిగిన వారినీ స్టేషన్ బయటి వరకూ తీసుకువచ్చి ఇతర వాహానాల్లో సుఖంగా వెళ్లేలా సాగనంపుతుంటారు. ఇంత చేస్తే ప్రయాణికులు ఇచ్చే కొద్ది పాటి డబ్బే వీరికి జీవనాధారం. వాటితోనే కుటుంబాన్ని పోషించుకుంటారు. కుటుంబం కడుపు నిండాలన్నా.. పిల్లల్ని బడికి పంపాలన్నా... ఇంటి అద్దెలు కట్టాలన్నా.. ప్రయాణికులు ఇచ్చే కొంతే వారికి ఆధారం.

  • నిరాశే మిగిలింది...

గడచిన కొద్ది రోజులుగా లాక్ డౌన్ నుంచి క్రమంగా మినహాయింపులు రావడంతో రైలు నడపడానికి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. ఇకపై రైళ్లు నడుస్తాయని తమ కడుపు నిండుతుందని ఎంతో ఆశపెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది. కేవలం కొద్దిపాటి రైళ్లు మాత్రమే నడుస్తుండటం తక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండంతో వీరికి ఉపాధి దొరకడం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్లో 200 మంది కూలీలు ఉండగా.. కొద్ది మందికి మాత్రమే పని దొరుకుతోంది.

కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక కూలీలు ఆందోళన చెందుతున్నారు. తక్కువ లగేజీతో ప్రయాణాలు చేయాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేయటంతో ఇతరుల అవసరం లేకుండా తక్కువ లగేజీతోనే ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రయాణికులు. రోజంతా స్టేషన్​లో వేచి చూసినా కుటంబ పోషణకు అవసరమైన డబ్బు రావడం లేదని విజయవాడలోని రైల్వే కూలీలు వాపోతున్నారు. ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

  • మమ్మల్ని ఆదుకోండి...

చాలా కాలంగా కూలీలుగా పని చేస్తోన్న వీరిలో... కొందరికి ఉద్యోగాలు ఇచ్చింది రైల్వేశాఖ. వారికి లాక్ డౌన్ కాలంలోనూ వేతనం అందుతోంది. మిగిలిన వారిని ఉద్యోగులుగా రైల్వే శాఖ పరిగణించకపోవడంతో రెక్కల కష్టంపైనే ఆధారపడాల్సిన దుస్ధితి నెలకొంది. అన్ని వర్గాలకూ చేయూతనిస్తోన్న కేంద్ర ప్రభుత్వం... తమను కూడా ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కన్నీళ్లు తుడవాలని అధికారులను వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

మంచంపై మృతదేహం... 4 కిలోమీటర్ల పయనం...

ABOUT THE AUTHOR

...view details