ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్(private bus driver), క్లీనర్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేశారు. సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన బాధ్యతను విస్మరించి.. మధ్యలోనే వదిలి వాళ్ల సామాన్లతో ఉడాయించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేరళ నుంచి అసోంకు 65 మంది ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెళ్తోంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద అల్పాహారం కోసం ఆపారు. ప్రయాణికులు అందరూ కిందకు దిగగానే డ్రైవర్, క్లీనర్ లగేజీతో ఉడాయించారు.
ఫంక్షన్ హాలులో బస..
ప్రయాణికులు బిహార్, బెంగాల్, నేపాల్, అసోంకు చెందిన వలస కూలీలు. కేరళలో పనులు చేసుకొని స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఇందుకోసం ఏజెంట్ ద్వారా ఒక్కొక్కరు రూ.3,500 చెల్లించినట్లు బాధితులు తెలిపారు. ఈనెల 3 తారీఖున కేరళ నుంచి బయల్దేరినట్లు చెప్పారు. బస్సులో సామాన్లు, డబ్బులు పోవడంతో నార్కట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని పోలీసులు తెలిపారు. బస్సుకు జీపీఎస్ ట్రాకర్ లేదని వెల్లడించారు. బాధితులకు తాత్కాలికంగా నార్కట్పల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో రాత్రి బసకు ఏర్పాట్లు చేశారు. బస్ డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.