ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Cyclone: 'గులాబ్‌' తుపాను పరిస్థితిపై సీఎం జగన్​తో మాట్లాడిన ప్రధాని - గులాబ్‌' తుపాను పరిస్థితిపై సీఎం జగన్​తో మాట్లాడిన ప్రధాని వార్తలు

'గులాబ్‌' తుపాను పరిస్థితిపై సీఎం జగన్​తో మాట్లాడిన ప్రధాని
'గులాబ్‌' తుపాను పరిస్థితిపై సీఎం జగన్​తో మాట్లాడిన ప్రధాని

By

Published : Sep 26, 2021, 3:44 PM IST

Updated : Sep 26, 2021, 4:37 PM IST

15:41 September 26

గులాబ్‌ తుపాను గురించి సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

గులాబ్ తుపాను (Gulab Cyclone) పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌తో(CM Jagan)  ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడారు. తుపాను ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి తక్షణ సాయం అందుతుందని ప్రధాని హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ట్వీటర్ వేదికగా వెల్లడించారు.

పొంచి ఉన్న తుపాను ముప్పు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాను (Gulab Cyclone) కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్​కు 140 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని.. విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి కన్నబాబు తెలిపారు. అర్ధరాత్రికి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గులాబ్‌ తుపాను దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని కుదించారు. మరికొన్ని దారిమళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

అప్రమత్తమైన అధికారులు

గులాబ్ తుపాను  (Gulab Cyclone) ముంచుకొస్తున్న తరుణంలో..శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసింది. గార, కవిటిలో జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా పరిధిలో తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో.. కలెక్టర్‌ శ్రీకేశ్​ లాఠకర్‌.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీసు, మెరైన్‌, విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సెలవులు రద్దు చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను పరిస్థితులను బట్టి ఆపదలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలను గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

ఆందోళనలో ప్రజలు 

ఈ తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని 27 గ్రామాల్లో మత్స్యకారులు.. అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బారువ, పొగరు వద్ద సుమారు 100 బోట్లను లంగరు వేసి ఉంచుకున్నామని.. మహేంద్రతనయ నుంచి భారీగా వరద వస్తే.. ఆ బోట్లన్నీ సముద్రంలోకి కొట్టుకుపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన వలలు, బోట్లు పాడవకుండా అధికారులు ముందస్తు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. తమ గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

Gulab Effect: ఉత్తరాంధ్రలో గులాబ్ తుపాను.. శ్రీకాకుళంలో భారీ వర్షాలు

Last Updated : Sep 26, 2021, 4:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details