తొలిదశ పల్లె పోరు ఖరారైంది. ప్రచార పర్వానికి తెరలేచింది. తొలి దశలో అంచనాకంటే ఏకగ్రీవాలు తగ్గాయి. విజయవాడ డివిజనులో మొత్తం 22 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో వైకాపా మద్దతుదారులు 20 మంది ఉండగా తెదేపా నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు. వీటిలోకొన్ని రెండు పార్టీల మద్దతుదారులు అవగాహనకు వచ్చి సర్పంచి, ఉపసర్పంచి పదవులను పంచుకున్నారు. కొన్ని పంచాయతీల్లో సమయం ముగిసిన తర్వాత కూడా ఏకగ్రీవం చేశారన్న ఫిర్యాదులు వచ్చాయి.
ప్రసాదంపాడు ఆఖరి నిమిషంలో ఏకగ్రీవం చేశారు. ఇక్కడ వైకాపా మద్దతుతో ఉమ్మడి అభ్యర్థినిగా తెదేపా సానుభూతిపరులు ఎస్.గంగారత్నం ఏకగ్రీవం అయ్యారు. బుధవారం వరకు కేవలం అయిదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. చివరి రోజు సంప్రదింపులు, చర్చల ద్వారా 17 పంచాయతీలు ఏకగ్రీవం చేయడం గమనార్హం. దాదాపు 250 వార్డుల వరకు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో తొలి విడత మొత్తం 234 పంచాయతీలు, 2502 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారంనాటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. వార్డుల ఏకగ్రీవాల లెక్కలు ఇంకా తేలలేదు. ఉపసంహరణల ఘట్టం ముగిసిన తర్వాత అభ్యర్ధులకు గుర్తులు కేటాయించారు. దీంతో ప్రచారంలోకి దూకారు. గుర్తులతో పాటు పార్టీ జెండాలు చేతపట్టారు. తొలిదశలో ఈనెల 7వతేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉంది. ఈనెల 9న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే.
ఎవరి ప్రయత్నాలు వారివి..
సర్పంచి అభ్యర్ధి ఎవరు.. ఎవరికి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది ఇలా గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. పార్టీ గుర్తులపై నిలబడక పోయినా పార్టీల ప్రభావం మాత్రం ఉంటుంది. అందుకే ఎవరికి వారు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. బందరు డివిజన్కు నోటిఫికేషన్ గడువు సమీపించడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. తమ పట్టు నిలబెట్టుకోవాలని అధికార పార్టీ, తమ సత్తా చూపించాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.