ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FD-SCAM : ఏఫ్‌డీల కుంభకోణంలో పోలీసుల ముందడుగు... వాటాలు పంచుకున్నట్లు నిర్ధరణ

ఆయిల్‌ఫెడ్‌ ఎఫ్‌డీల కేసు దర్యాప్తులో విజయవాడ సీసీఎస్ పోలీసులు ముందడుగు వేశారు. ఎఫ్‌డీలను దారి మళ్లించి, డొల్ల ఖాతాలకు తరలించిన అక్రమార్కులు... ఆ తర్వాత వాటాలు పంచుకున్నట్లు తేల్చారు. ఈ డొల్ల ఖాతాల అంశంపై వీరపనేనిగూడెం సప్తగిరి బ్యాంకు, ఆయిల్‌ఫెడ్‌ అధికారులను పిలిపించి విచారించారు.

By

Published : Oct 25, 2021, 2:40 AM IST

ఏఫ్‌డీల కుంభకోణంలో పోలీసుల ముందడుగు
ఏఫ్‌డీల కుంభకోణంలో పోలీసుల ముందడుగు

ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో వెలుగుచూసిన రూ.5 కోట్లు ఎఫ్‌డీ అక్రమాల కేసులో విజయవాడ సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దారి మళ్లిన సొమ్ములో ఇప్పటివరకు స్వాధీనం లేదా సీజ్‌ చేసిన మొత్తం తక్కువే. ఎఫ్‌డీ సొమ్మును డొల్ల ఖాతాలకు తరలించి, అనంతరం అక్రమార్కులు వాటాలేసి పంచుకున్నట్లు పోలీసులు నిర్ధరించారు. గన్నవరం సమీపంలోని వీరపనేనిగూడెం సప్తగిరి బ్యాంకులో ఎఫ్‌డీ చేసిన అధికారులు... గడువు తీరకుండానే రద్దు చేసి ఇతర ఖాతాలకు మళ్లించారు. ఈ విషయంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేసిన సీసీఎస్ పోలీసులు వారితో పాటు ఆయిల్‌ఫెడ్‌ అధికారులను పిలిపించి విచారించారు.

నకిలీ లేఖల సృష్టి...

ఈ ఏడాది మే 15న ఆయిల్‌ఫెడ్‌ సంస్థకు చెందిన రూ.5 కోట్లు..... పటమట ఐసీఐసీఐ ఖాతా నుంచి సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఖాతాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆయిల్‌ఫెడ్‌ అధికారులు మెయిల్‌ రూపంలో సప్తగిరి బ్యాంకుకు తెలియజేశారు. ఏడాది కాలానికి ఎఫ్‌డీఆర్‌లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటి గడువు ముగిశాక డిపాజిట్‌ మొత్తం, వడ్డీని పటమట ఎస్బీఐ ఖాతాలో జమ చేయాలని కోరారు. ఈ మేరకు ఎఫ్‌డీలు అయిన తర్వాత వాటిని ఆయిల్‌ఫెడ్‌కు అందజేశారు. కానీ ఈ మూడు డిపాడిట్లను రద్దు చేయాలని సంస్థ అధికారుల పేరిట నకిలీ లేఖలు సృష్టించారు. వీటి ఆధారంగా ఎఫ్‌డీలను రద్దు చేసి, ఏపీ మర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి మళ్లించారు. ఎఫ్‌డీల రద్దుపై తమకు కనీస సమచారం లేదని ఆయిల్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు.

ఆచూకీ కోసం గాలింపు...

ఈ కుంభకోణంలో ఏపీ మర్కంటైల్‌ బ్యాంకు అప్పటి మేనేజర్ రామిరెడ్డి కీలక పాత్ర పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం వెలుగుచూడగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రామిరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బెంగళూరులోని కుమారుడి ఇంటికి వెళ్లినట్లు తెలిసి పోలీసు బృందాలు వెళ్లగా అక్కడి నుంచి కూడా పరారైనట్లు తేలింది. రామిరెడ్డి దొరికితే అసలు విషయం బయటికొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో బ్యాంకు ఉన్నతాధికారులను కూడా పిలిపించి సమాచారం అడిగారు. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం చిత్తూరులో ఉంది. అక్కడి నుంచి ఒకటి, రెండ్రోజుల్లో వివరాలు రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరో నిందితుడైన షిర్డీకి చెందిన మదన్‌ ఆచూకీ కూడా దొరకాల్సి ఉంది. ఇతడు నకిలీ లేఖలపై ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసేవాడు.

ఏఫ్‌డీల కుంభకోణంలో పోలీసుల ముందడుగు

నగదు మళ్లింపుతో...

ఏపీ మర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీని స్థాపించిన బీవీవీ.నాగసత్యనారాయణ... డిపాజిట్ల సొమ్మును డొల్ల ఖాతాలకు మళ్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇప్పటికే ఆయన్ని హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2013లో ఈ సొసైటీని ప్రారంభించిన నాగసత్యనారాయణ ఓ వ్యక్తి 2.5 కోట్ల రూపాయల మేర మోసం చేయడంతో అప్పులపాలయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో సోమశేఖర్‌ అలియాస్‌ రాజ్‌కుమార్‌తో కుమ్మక్కై నకిలీ కరెంట్‌ ఖాతాలను తెరిచారు. వివిధ ఖాతాల్లోని నగదును వీటిల్లోకి మళ్లించారు. దీనికి గానూ 7 శాతం కమీషన్‌ దక్కింది.

పీటీ వారెంట్లు దాఖలు...

ఈ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కీలక నిందితులను హైదరాబాద్‌ సీసీఎస్ పోలీసులు అరెస్ట్‌ చేయగా వారంతా జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. వీరిని విచారించేందుకు విజయవాడ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. ఆయిల్‌ఫెడ్‌ గోల్‌మాల్‌కు సంబంధించి వీరిని ఈ నెల 27 లోగా హాజరుపర్చాల్సి ఉంది. అనంతరం నేరంతో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను కస్టడీకి కోరతూ పిటిషన్‌ వేసే అవకాశం ఉంది. న్యాయస్థానం అనుమతితో అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టనున్నారు. గిడ్డంగుల సంస్థ కుంభకోణానికి సంబంధించి కూడా... పీటీ వారెంటుకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. ఈ ముఠాకు రెండు సంస్థల్లోని ఉద్యోగులు ఎవరైనా సహకరించారా అన్నది కూడా అప్పుడే తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details