ఎనిమిదేళ్ల కిందట నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారుల లెక్కల ప్రకారం నగరంలో వీధికుక్కల సంఖ్య 8 వేలు.. ఆరేళ్ల కిందట 13వేలు.. 2017లో 13,500.. ప్రస్తుతం వాటిసంఖ్య 16 వేల పైమాటే.. దాదాపు 11 ఏళ్లగా నగరంలో వీధికుక్కలను నియంత్రించేందుకు అధికారులు రూ.లక్షలు వెచ్చించి కు.ని.శస్త్రచికిత్సలు చేస్తున్నా వాటి సంఖ్య మాత్రం తగ్గడంలేదు. వీధుల్లో స్వైరవిహారం చేస్తూ నగరవాసులకు బెంబేలెత్తిస్తున్నాయి. పలువురిపై దాడి చేస్తున్నాయి.
కొన్ని రోజులుగా విజయవాడలో ఏ వీధిలో చూసినా శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. బయటకు రావాలంటే జనం భయపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు నిర్వహిస్తున్న శస్త్రచికిత్సలపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత హైదరాబాద్కు చెందిన నవోదయా సొసైటీ అనే ఏజెన్సీకి నగరంలోని వీధికుక్కలకు కు.ని.శస్త్రచికిత్సలు చేసే బాధ్యతలను అప్పగించారు.
వీరు నెలకు కనిష్ఠంగా 350 నుంచి 500 కుక్కలకు ఆపరేషన్లు చేసి, రెండున్నర ఏళ్లలో నగరంలోని మొత్తం శునకాలకు పూర్తిచేయాలని సూచించారు. తర్వాత కొద్దికాలం యానిమల్ కేర్ సెంటర్ అనే ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించారు. నగరపాలక సంస్థ చెెల్లిస్తున్న సొమ్ము సరిపోవడం లేదంటూ ఆ సంస్థ వెళ్లిపోయింది. తిరిగి కొంతకాలంగా నవోదయా సొసైటీనే వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు చేయిస్తోంది.
ఏం చేస్తున్నారంటే..
సింగ్నగర్లో యానిమల్ భర్త్ కంట్రోల్ షెడ్(ఏబిసి)ని ఏర్పాటు చేసి కొద్దికాలంగా అక్కడ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కుక్కలను పట్టుకెళ్లడం, డాక్టర్లను ఏర్పాటు చేసుకోవడం, ఆపరేషన్ చేయడం, ఆపై వారంపాటు వాటికి పాలు, ఆహారం ఇవ్వడం, మందులు ఇవ్వడం, యాంటీరెబీస్టీకాలు వేసి తిరిగి వదిలేయడం వంటివన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు ఏజెన్సీదే. గతంలో వీధికుక్కల నియంత్రణకు అధికారులు ఏకంగా రూ.33 లక్షలు ఖర్చుచేశారు.