అధికారపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది: తెదేపా - Opposition strangles in House: tdp allegations on YCP
శాసనసభలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా వ్యవహారిస్తూ ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి మాటమార్చటం మోసం కాదా అని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవను రద్దు చేసి, రైతు భరోసా తెచ్చారని... కానీ ఆ విషయంలోనూ రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
![అధికారపక్షం ప్రతిపక్షం గొంతు నొక్కుతోంది: తెదేపా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3982552-628-3982552-1564415650214.jpg)
అమరావతిలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. శాసనసభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వైకాపా నేతలు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఏకపక్షంగా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకంటున్నారని, ఆయా శాఖలకు సీఎం బంధువులే మంత్రులుగా ఉన్నారని నేతలు దుయ్యబట్టారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్లో కొత్తదనమేమీ లేదన్నారు. హడావిడిగా బిల్లులు తయారు చేసి సభలో ప్రవేశపెట్టారని అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ. 5,700కోట్లు రాబట్టలేదని, హైదరాబాద్లోని భవనాలపై హక్కులు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ఉన్నత విద్యామండలి నిధులపై సుప్రీం తీర్పును గౌరవించాలని ఎందుకు కోరలేదన్నారు. తెలంగాణలో ఉన్న సింగరేణి కాలరీస్ వారికే చెందుతుంటే... హెవీ మిషనరీ ఇంజినీరింగ్ మనకెందుకు వర్తించదని నిలదీశారు. నీళ్లు, నిధులు తెలంగాణకు ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు కాలరాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లోనే మాట తప్పుతున్నారని, మడమ తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పి మాటమార్చడం మోసం కాదా అని అడిగారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవర ప్రసాద్, గౌరివాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.