ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం ఆదేశాలతో ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన

By

Published : Oct 25, 2020, 11:38 AM IST

ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవ‌ల కురిసిన భారీవ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బతిన్న పంట‌పొలాలు, కూలిన ఇళ్లు, ఇత‌ర న‌ష్టాల‌ను వివిధ జిల్లాల క‌లెక్టర్లు, జాయింట్ క‌లెక్టర్లు, స‌బ్ క‌లెక్టర్లు ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి వారికి క‌లిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేశారు. వచ్చే వారంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రానుండడంతో జిల్లా కలెక్టర్లు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన
ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన

విశాఖ‌ప‌ట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ముంపున‌కు గురైన పంట‌పొలాల‌ను జిల్లా క‌లెక్టర్ వి.విన‌య్‌చంద్ ప‌రిశీలించారు. ర‌జాల గ్రామంలో జ‌రిగిన న‌ష్టాన్ని వ్యవ‌సాయ అధికారుల‌తో క‌ల‌సి పరిశీలించి రైతుల‌తో మాట్లాడారు. శార‌దా న‌ది ముంపు నివారించేందుకు ప‌టిష్ఠ చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు. న‌ర్సీప‌ట్నం స‌బ్ క‌లెక్టర్ నార‌పురెడ్డి మౌర్య నాత‌వ‌రం మండ‌లంలోని జిల్లేడుపూడి గ్రామాన్ని సంద‌ర్శించి...వ‌ర్షాల‌కు దెబ్బతిన్న ఇళ్లను ప‌రిశీలించారు. బాధితుల‌తో మాట్లాడి దెబ్బతిన్న గృహాల‌కు త్వర‌గా ప‌రిహారం ఇప్పించే ప్రయ‌త్నం చేస్తామ‌న్నారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీవ‌ర్షాల కార‌ణంగా దెబ్బతిన్న పంట‌ల‌ను జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ ప‌రిశీలించారు. గొల్లల‌పాలెం గ్రామంలో వ్యవ‌సాయ అధికారుల‌తో క‌ల‌సి ప‌ర్యటించి వ‌రి పొలాల‌ను ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి పంట‌న‌ష్టంపై ఆందోళ‌న చెందొద్దని ప్రభుత్వం ఆదుకుంటుంద‌ని భ‌రోసానిచ్చారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా క‌లెక్టర్ రేవు ముత్యాల‌రాజు ఉంగుటూరు మండ‌లం కైక‌రం, బాదంపూడి గ్రామాల్లో ప‌ర్యటించి భారీవ‌ర్షాల కార‌ణంగా ముంపున‌కు గురైన పంట‌పొలాల‌ను, ఎన్యూమ‌రేష‌న్ జ‌రుగుతున్న విధానాన్ని ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి న‌ష్టపోయిన రైతులంద‌రికీ ప‌రిహారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

కృష్ణా జిల్లాలో భారీ వ‌ర్షాల‌కు, కృష్ణా న‌దికి సంభ‌వించిన వ‌ర‌ద‌ల కార‌ణంగా కంచిక‌చ‌ర్ల, నందిగామ‌, చంద‌ర్లపాడు మండ‌లాల్లోని ప‌లు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను జిల్లా జాయింట్ క‌లెక్టర్ కె.మాధ‌వీల‌త‌, విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్టర్​తో క‌ల‌సి ప‌రిశీలించారు. పంట‌ల‌కు, ఇళ్లకు జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నా వేశామ‌ని, ప్రభుత్వానికి నివేదిక‌లు పంపిస్తున్నట్టు వివ‌రించారు. ఇప్పటికే 27 మండ‌లాల్లో వ‌ర‌ద బాధితుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేశామ‌న్నారు. శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం‌, సోంపేట మండ‌లాల్లో జిల్లా క‌లెక్టర్ జె.నివాస్ ప‌ర్యటించి పంట‌న‌ష్టాన్ని ప‌రిశీలించారు. న‌ష్టాన్ని అంచ‌నావేసి ప్రభుత్వానికి నివేదిస్తామ‌న్నారు.

క‌డ‌ప జిల్లాలో కుందూ న‌దీ ప‌రీవాహ‌క ప్రాంత‌మైన చాపాడు మండ‌లం ల‌క్ష్మీపేట పంచాయ‌తీ ప‌రిధిలోని కేత‌వ‌రం గ్రామ పంట పొలాల‌ను జిల్లా క‌లెక్టర్ సి.హ‌రికిర‌ణ్ ప‌రిశీలించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా జ‌రిగిన పంట న‌ష్టాల‌పై నివేదిక‌లు రూపొందించి ప్రభుత్వానికి పంపించామ‌ని.., న‌ష్టపోయిన రైతుల‌కు ప‌రిహారం అంద‌జేస్తామ‌న్నారు. త‌వ్వారిప‌ల్లిలో జాయింట్ క‌లెక్టర్ సాయికాంత్ వ‌ర్మ ప‌ర్యటించి పంట‌న‌ష్టం జాబితాను ప‌రిశీలించారు. న‌ష్ట ప‌రిహారం త్వర‌గా విడుద‌ల‌య్యేలా చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు. రాజంపేట డివిజ‌న్​లో స‌బ్ క‌లెక్టర్ కేత‌న్ గార్గ్ పర్యటించారు.

క‌ర్నూలు జిల్లాలో ఇన్​ఛార్జ్ క‌లెక్టర్ ర‌వి ప‌ట్టన్ శెట్టి పర్యటించారు. డోన్, ప్యాపిలి మండ‌లాల్లో వరదల కారణంగా దెబ్బతిన్న వేరుశ‌న‌గ‌, కంది, ఆముదం పంట‌ల‌ను ప‌రిశీలించి పంట‌న‌ష్టంపై రైతుల‌తో మాట్లాడారు. జిల్లా జాయింట్ క‌లెక్టర్ ఎస్‌.రామ‌సుంద‌ర్ రెడ్డి ఆత్మకూరు మండ‌లం క‌రివేన‌, న‌ల్లా కాలువ‌, బ్రాహ్మణ అనంత‌పురంలో పంట న‌ష్టాన్ని ప‌రిశీలించారు. క‌ర్నూలు జాయింట్ క‌లెక్టర్(సంక్షేమం) స‌య్యద్ ఖాజా మొహిద్దీన్ పాణ్యం మండ‌లం అనుపూర్‌, పాణ్యం గ్రామంలో ప‌ర్యటించి వ‌ర్షాల‌కు దెబ్బతిన్న ఇళ్లను, పంట‌లను ప‌రిశీలించారు. నంద్యాల స‌బ్ క‌లెక్టర్ క‌ల్పనా కుమారి, ఆదోని ఆర్డీవో రామ‌కృష్ణారెడ్డి, క‌ర్నూలు ఆర్డీవో వెంక‌టేష్ త‌మ ప‌రిధిలోని మండ‌లాల్లో ప‌ర్యటించారు.

ఇదీచదవండి

'రూ.వేలు పెట్టుబడి పెట్టినా... వడ్ల గింజ కూడా దక్కలేదు'

ABOUT THE AUTHOR

...view details