ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 795 బీ-కేటగిరి సీట్లకు రెండు విడతల కౌన్సెలింగ్ నిర్వహించారు. మొదటి విడత పూర్తయ్యేసరికి 295 సీట్లు మిగిలాయి. రెండో విడత నిర్వహించగా.. 109 సీట్లు మిగిలాయి. ఈ సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారని విద్యార్థులు ఎదురుచూశారు. కానీ.. మిగిలిన సీట్లను మాప్అప్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేశారు. దీనిపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మాప్అప్అనడంతో ఆందోళన...
మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీ-కేటగిరి సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత సీట్లు వచ్చిన విద్యార్థులకు రెండో విడతలో మరో మంచి కళాశాలలో సీటొస్తే.. స్లైడింగ్ విధానంలో అక్కడికి వెళ్లిపోయేందుకు అవకాశం ఇచ్చారు. కానీ.. రెండో విడతలో సీటొచ్చిన విద్యార్థులకు స్లైడింగ్కు అవకాశం ఇవ్వకుండా కౌన్సెలింగ్ ముగించారు. మిగిలిన 109 సీట్లకు మూడో విడత కౌన్సెలింగ్ పెడితే.. మరో మంచి కళాశాలకు మారొచ్చని చాలామంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించకుండా.. మాప్అప్ అనడంతో రెండో విడతలో సీట్లు వచ్చిన విద్యార్థులు మరో కళాశాలకు మారే అవకాశం లేకుండాపోయింది.
రెండు రౌండ్లతోనే ముగింపు...