ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

No Police Support: భద్రత లేదు... బందోబస్తూ లేదు.. భారీ సభకు కొరవడిన సహకారం - మహానాడుకు సహకారం అందించని పోలీసులు

No police support: మహానాడుకు పోలీసుల నుంచి ఏ మాత్రం సహకారం లేకుండా పోయింది. లక్షల మంది జనం తరలివచ్చినా తగిన భద్రత, బందోబస్తు కల్పన, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. విధుల్లో ఉన్నదే కొద్ది మంది సిబ్బంది.. వారు కూడా బాధ్యతలేవి తమకు పట్టనట్లుగా, అసలు అది తమ పనే కాదన్నట్లుగా వ్యవహరించారు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబు.. కాన్వాయ్‌కు కూడా రూట్‌ క్లియర్‌ చేయలేకపోవడం వివాదస్పమైంది.

no police support for mahanadu held at ongole
మహానాడుకు కొరవడిన పోలీసుల సహకారం

By

Published : May 29, 2022, 6:42 AM IST

No police support: మహానాడు భారీ బహిరంగ సభకు లక్షాలదీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులకు పోలీసులు కనీస సహకరించలేదు. ఓ చోటైతే తెదేపా కార్యకర్తల వాహనాల టైర్లలో గాలి తీసేసి వారిని ఇబ్బందులకు గురి చేశారు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబు.. కాన్వాయ్‌కు కూడా సరిగ్గా రూట్‌ క్లియర్‌ చేయలేకపోయారు.

చంద్రబాబు బస చేసిన అతిథిగృహం నుంచి మండువవారిపాలెంలోని సభా ప్రాంగణం మధ్య అయిదు కిలోమీటర్ల దూరం కాగా.. ఆ ప్రయాణానికి దాదాపు 45 నిమిషాలకు పైగానే సమయం పట్టింది. ఆయన ప్రయాణించే దారి మొత్తం వాహనాలు కిక్కిరిసిపోయాయి. అయినా సరే పోలీసులు దాన్ని క్లియర్‌ చేయలేదు. చివరికి తెదేపా కార్యకర్తలే రంగంలోకి దిగి.. చంద్రబాబు వాహనశ్రేణికి రూటు క్లియర్‌ చేస్తూ ముందుకు కదిలేలా చేశారు.

మహానాడులో పాలొనేందుకు శనివారం ఉదయం నుంచే భారీగా ఎత్తున ప్రజలు వాహనాల్లో ఒంగోలుకి తరలివచ్చారు. ఆ విషయం గుర్తించి కూడా రద్దీ ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోలేదు. వాహనాల పార్కింగ్, జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఫలితంగా 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై నెల్లూరు-విజయవాడ మార్గంలో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మహానాడుకు వచ్చే నాయకులు, కార్యకర్తల వాహనాల పార్కింగ్‌ కోసం ముందుగానే పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించారు. వాటి గురించి ప్రచారం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఆయా ప్రదేశాలకు తరలించాల్సిన పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. విశాఖ, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒంగోలులోని కిమ్స్‌ అండర్‌పాస్‌ నుంచి యూ టర్న్‌ తీసుకొని రావాల్సి ఉండగా అక్కడ ఇరుకుగా ఉండటంతో తమ వాహనాలను త్రోవగుంట సర్వీసు రోడ్డుతో పాటు జాతీయ రహదారికి రెండు వైపులా నిలిపివేశారు. దీంతో రహదారి కుంచించుకుపోయి ప్రధాన రహదారిలో ట్రాఫిక్‌ సజావుగా సాగడం కష్టమైంది. దీంతో పదేపదే అన్నీ ఆగిపోవాల్సి వచ్చింది.

త్రోవగుంట జాతీయ రహదారిపై నిత్యం వెలిగే విద్యుత్తు దీపాలు మహానాడు రోజున వెలగలేదు. రాత్రి సమయం కావడంతో మహానాడుకు వచ్చినవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెలుతురు లేకపోవడంతో తమ వాహనం ఎక్కుడుందో తెలియక అయోమయానికి గురయ్యారు. మహానాడు ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ తెదేపా కార్యకర్తలకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పలేదు.

రాత్రి ఎనిమిది గంటలకు మహానాడు ముగిసినా పది గంటల వరకు రహదారిపై రద్దీ కొనసాగుతూనే ఉంది. వేల వాహనాలతో ఒక్కసారిగా రోడ్లపైకి రావటంతో రద్దీ తీవ్రమైంది. పగలంతా పెద్దగా కనిపించని పోలీసులు రాత్రి 9 గంటల తర్వాత హడావిడిగా రోడ్ల మీదకు వచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details