ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత !

By

Published : Mar 23, 2021, 4:58 AM IST

Updated : Mar 23, 2021, 6:14 AM IST

రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యా కేంద్రం విజయవాడ. అన్ని ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు వచ్చి ఇక్కడి పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసి బయటకు వచ్చాక.. ఇక్కడ సరైన అవకాశాల్లేక హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు, విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు.

ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత
ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు యువత

విజయవాడ నగరం రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యా కేంద్రం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు వచ్చి ఇక్కడి పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 274 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉంటే అందులో 76 కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయి. ఏటా 34 వేల మంది విద్యార్థులు వీటిలో చేరుతుంటారు. వీరు కాకుండా అయిదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇన్నివేల మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసి బయటకు వచ్చాక.. ఇక్కడ సరైన అవకాశాల్లేక హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు, విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇదే సమయంలో ఎక్కువ మంది విశ్రాంతోద్యోగులు, వయోవృద్ధులు నివాస ప్రాంతంగా విజయవాడను ఎంచుకుంటున్నారు. ఆసుపత్రులు, దుకాణ సముదాయాలన్నీ అందుబాటులో ఉండటంతో ఈ నగరంలో స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే విజయవాడ నగరం విశ్రాంతోద్యోగుల హబ్‌గా మారుతోందే తప్ప యువతను ఆకర్షించేదిగా మారడం లేదు. ప్రధానంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండే పనిచేసే యువత ఇక్కడ తగ్గిపోతున్నారని ప్రజా సైన్స్‌ రచయిత, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌ పేర్కొన్నారు.

బెజవాడలో పనిచేసే గ్రూపులో 35 ఏళ్లలోపు వారు.. కేవలం చిరుద్యోగులు, శ్రామికుల్లోనే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో పనిచేసే వర్గంలో 35ఏళ్లలోపు వాళ్లు 60 శాతం ఉంటారు. కానీ విజయవాడలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవారే ఈ విభాగంలోకి వస్తున్నారు. యువతను ఉద్యోగంతో ఆకర్షించడంలో విజయవాడ విఫలమవుతోంది. ఇక్కడ కేవలం వస్త్ర దుకాణాలు, మార్కెటింగ్‌, షాపింగ్‌మాల్స్‌, ఆసుపత్రులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు లాంటివే ఎక్కువ ఉన్నాయి. పది, ఇంటర్‌ చదివి ఆపేసిన.. నిరుద్యోగ యువతకు ఉపాధి ఇవ్వడానికి మాత్రమే ఇవి పనికొస్తున్నాయి. అధిక శాతం 10 నుంచి 15 వేల మధ్య జీతం వచ్చే కొలువులే. అందుకే విజయవాడలోని 50 శాతం జనాభాకు కుటుంబ సగటు ఆదాయం రూ.25 వేల లోపే ఉంటోంది. రాజధాని నేపథ్యంలో కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఐటీ పరిశ్రమల్లో చాలావరకు ప్రస్తుతం వెళ్లిపోయాయి. కొన్ని పరిశ్రమల ఏర్పాటు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో గత అయిదేళ్లలో వచ్చిన కొద్దిపాటి అవకాశాలు కూడా ప్రస్తుతం లేకుండా పోయాయి.

పదేళ్లలో రెట్టింపైన జనాభా

విజయవాడ నగర జనాభా గత పదేళ్లలో విపరీతంగా పెరిగింది. 2011 గణన ప్రకారం నగర జనాభా 10.34 లక్షలు. ప్రస్తుతం 15 లక్షలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ.. కనీసం 18 నుంచి 20 లక్షలు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన అంతర్జాతీయ జనాభా లెక్కల సంస్థ 2016లో 5లక్షల కంటే ఎక్కువ మంది నివసించే నగరాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దీనిలో జనసాంద్రతలో ప్రపంచంలోనే విజయవాడ మూడో స్థానంలో నిలిచింది. నగరంలో ప్రతి చదరపు కిలోమీటరుకు 31,200 మంది నివాసం ఉంటున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

73 భారీ పరిశ్రమలు.. 29,800 ఉద్యోగులు

విజయవాడ సహా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం 73 భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు పరిశ్రమలతో పాటు విజయవాడ రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపు, బీఎస్‌ఎన్‌ఎల్‌, వీటీపీఎస్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలూ ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో 29,800 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. 500 నుంచి వెయ్యి మంది పనిచేసే పరిశ్రమలు 12 ఉన్నాయి. వీటీపీఎస్‌, మోహన్‌ స్పిన్‌టెక్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాపుల్లో వెయ్యి మందికి పైగా పనిచేస్తున్నారు. అత్యధిక ప్రైవేటు పరిశ్రమలు సిమెంట్‌, చేపలు, పశువుల దాణా తయారీ, ఆస్బెస్టాస్‌ షీట్లు, సిరామిక్‌ టైల్స్‌, కాటన్‌యార్న్‌, కాటన్‌ స్పిన్నింగ్‌, ఆటోమొబైల్‌ ఉత్పత్తుల తయారీ, టెక్స్‌టైల్స్‌కు సంబంధించినవే ఉన్నాయి. వీటిలో ఉద్యోగాలు అధికంగా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌ చదివిన వాళ్లకే ఉంటున్నాయి.

ఐటీలో హెచ్‌సీఎల్‌ ఒక్కటే

గన్నవరంలోని హెచ్‌సీఎల్‌ ఒక్కటే ఈ ప్రాంతంలో ఉన్న ఐటీ ప్రాంగణం. ఇక్కడ రెండు వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా వెయ్యి మందిని తీసుకున్నారు. ఇంజినీరింగ్‌తో పాటు ఇంటర్‌, డిగ్రీ, పూర్తిచేసిన యువతకు అవకాశాలు కల్పించారు. గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో ఐటీ పరిశ్రమల ఏర్పాటు కోసం గట్టి ప్రయత్నాలు జరిగాయి. భారీగా రాయితీలివ్వడం, గన్నవరంలో మేథా, విజయవాడ ఆటోనగర్‌లో ఐటీ పార్క్‌ లాంటివి ఏర్పాటు చేయడంతో 100 వరకు స్టార్టప్‌లు, చిన్న కంపెనీలు వచ్చాయి. మంగళగిరి ప్రాంతంలోనూ కొన్ని కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ కలిపి నాలుగైదు వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చాయి. గతంలో ఇచ్చిన ప్రభుత్వ రాయితీలను ప్రస్తుతం ఆపేయడంతో ఈ కంపెనీల్లో చాలావరకూ తరలిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఫార్మాకు అనుబంధంగా ఉన్న కోర్సులనే చదువుతున్నారు. కానీ ఇక్కడ ఒకటి రెండు చిన్న ఫార్మా కంపెనీలు మాత్రమే ఉన్నాయి. దీంతో చదువు పూర్తవగానే ఉద్యోగం కోసం ఇతర నగరాలకు వెళ్లిపోతున్నారు.

10 శాతం మందిని ఉంచగలిగినా..

విజయవాడలో ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ వరకు ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతుంటారు. వీరంతా ఎక్కడెక్కడి నుంచో చదువుకునేందుకు విజయవాడకు వస్తున్నారు. చదువు పూర్తవగానే ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. వారిలో కనీసం 10 శాతం మంది విద్యార్థులకు ఇక్కడే మంచి కొలువులు అందుకునే అవకాశం కల్పించగలిగినా.. నగరం యువ ఉద్యోగుల హబ్‌గా మారుతుంది. చాలామంది విద్యార్థులు రూ.25 వేల జీతం వచ్చే కొలువు దొరికినా చాలు ఇక్కడే ఉంటామని ఆశపడుతున్నారు. కానీ ఆ అవకాశం కూడా లేక ఇతర నగరాలకు వెళుతున్నారు. ఇక్కడ ఐటీ, ఫార్మా, బీపీవో, వస్తు ఉత్పత్తి పరిశ్రమలు లేకపోవడమే ప్రధాన లోపం. పాలకులు వాటిపై ప్రధానంగా దృష్టి సారించాలి. లేదంటే పనిచేసే సామర్థ్యమున్న యువతను తయారుచేసి ఇతర నగరాలకు పంపిణీ చేసే కేంద్రంగానే విజయవాడ మిగిలిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

వృద్ధ నగరంగా మారబోతోంది

నేను జిల్లా రిసోర్స్‌పర్సన్‌గా ఉన్నప్పటి నుంచి చాలా ఏళ్లుగా విజయవాడ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నాను. విజయవాడను అతి గొప్పదైన పేద నగరంగా అభివర్ణించవచ్చు. ఏ నగరమైనా కొత్త తరాన్ని ఆకర్షించగలిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే వృద్ధ నగరంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరుల్లో చదువుకోవడానికి వచ్చేవారికి అక్కడే ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయి. అందుకే ఎప్పుడూ యువతను ఆకర్షిస్తూ నిత్య యవ్వన నగరాలుగా, డైనమిక్‌ సిటీలుగా ఎదుగుతున్నాయి. ఇక్కడా అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే విజయవాడ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. - డాక్టర్‌ తుమ్మల శ్రీకుమార్‌, ఆంధ్ర లయోలా కళాశాల అధ్యాపకులు, పర్యావరణవేత్త

వనరులకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాణిజ్య పంటలు, ఆహార ఉత్పత్తులు, మత్స్యసంపద అధికం. ఈ రంగాలకు అనుబంధంగా ఉండేవి.. ప్రధానంగా ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితే యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు వస్తాయి. ఐటీ, ఫార్మా రంగ సంస్థలు రావడం ఎంత కీలకమో.. ఇక్కడి వనరులకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ఏర్పాటూ అంతే అవసరం. - ఎం.సి.దాస్‌, ఆర్థిక రంగ నిపుణులు

ఎక్కడా లేనంతమంది విద్యార్థులు

రాష్ట్రంలోని మరెక్కడా లేనంత మంది విద్యార్థులకు కేంద్రం విజయవాడ. ఏటా వేల మంది విద్యార్థులు చదువులు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లి దేశవిదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇది చదువుల నగరమే కానీ ఉద్యోగాల కల్పనకు అవకాశం లేదు.. అనే పరిస్థితి నెలకొంది. ఐటీ సహా అన్ని రకాల పరిశ్రమలను తీసుకురావాలి. - కోట సాయికృష్ణ, విద్యావేత్త

ఇదీచదవండి

నియోజకవర్గానికి ఒక వాహనం..వెటర్నరీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Last Updated : Mar 23, 2021, 6:14 AM IST

ABOUT THE AUTHOR

...view details