కరోనా మెుదటి వేవ్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకే రూ. 1900 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అందరికి టీకాలు వేయించేందుకు రూ.1600 కోట్ల కోసం వెనకాడుతుందన్న విమర్శలు సరికాదని మంత్రి కొడాలి నాని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు పనికట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వందేళ్ల చరిత్రలో ఇటువంటి వైరస్ మానవ జాతి మీద దాడి చేసిన దాఖలాలు లేవని, దీనిని ఎదుర్కొవడానికి, ప్రజల్ని కాపాడుకోవటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు.
సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టీకాల విషయంలో వెనకాడుతుందా? అని కొడాలి నాని ప్రశ్నించారు. కేవలం 24 గంటల్లో 6 లక్షల వ్యాక్సిన్ లు పూర్తి చేసిన ఘనత దేశంలో మరే ఏ రాష్ట్రంలో లేదని, ఆంధ్రప్రదేశ్ కే ఉందన్నారు. కొవిడ్ టీకా విధి విధానాలను కేంద్రం రూపొందించిందని చెప్పారు. ఆ కంపెనీలకు ముఖ్యమంత్రి లేఖలు రాశారని, ఫోన్ లు చేసి మాట్లాడారని కొడాలి నాని అన్నారు. 1600 కోట్లు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వ్యాక్సిన్లు సరఫరా చేస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేయటానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్నికి అవసరమైన వ్యాక్సిన్ ను తెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించాలని కోరారు.