ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2022, 8:19 PM IST

ETV Bharat / city

పది పరీక్షల్లో పేపర్ లీక్ జరగలేదు.. కానీ 60 మందిపై కేసులు : మంత్రి బొత్స

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఓ వైపు ఎక్కడా మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ జరగలేదంటూనే.. మరోవైపు ప్రశ్నాపత్రాల విషయంలో 60 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు.

పది పరీక్షల్లో పేపర్ లీక్ జరగలేదు
పది పరీక్షల్లో పేపర్ లీక్ జరగలేదు

పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ అనేది జరగలేదని చెప్పారు. అదే సమయంలో.. ప్రశ్నాపత్రాల విషయంలో మాత్రం 60 మందిపై కేసులు నమోదు చేశామని ప్రకటించడం విశేషం. 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేటు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రిమినల్ కేసు పెట్టామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరుగుతోందని తెలిపారు.

పది పరీక్షల్లో పేపర్ లీక్ జరగలేదు

ఈ విషయంలో.. కొన్ని పార్టీలు ప్రభుత్వంపై కావాలనే బురద జల్లాలని చూస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. అక్రమార్కులను ప్రోత్సహించేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందన్నారు. మేం తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. తప్పు చేసినవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎం జగన్‌ విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

టెన్త్​లో ఫెయిల్..ఇంటర్​లోనైనా పాసవ్వండి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు. రోజుకో చోట ప్రశ్నాపత్రం లీకేజ్‌ జరుగుతోందని.. ప్రశ్నాప్రత్రాలు వైకాపా నేతల వాట్సాప్‌ గ్రూపుల్లో తిరుగుతున్నాయని ఆరోపించారు. లీకేజ్​ ఘటనలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవి నుంచి తప్పుకోలన్నారు. పది పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం ఇంటర్ పరీక్షలనైనా పకడ్బందీగా నిర్వహించాలని లోకేశ్ హితవు పలికారు.

ఏదీ నిజం: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలపై సీఎం జగన్ స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఓ వైపు లీకేజీలకు పాల్పడిన పలువురిని అరెస్టు చేసినట్లు చెబుతుంటే..విద్యాశాఖ మంత్రి మాత్రం ఎక్కడా లీకేజీ జరగలేదని చెబుతున్నారన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ లేకపోతే.. అరెస్టులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షలు కూడా సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వమెందుకని నిలదీశారు.

ఇదీ జరిగింది:ఏప్రిల్‌ 27న పది పరీక్షలు ప్రారంభం కాగా.. తెలుగు పేపర్‌ నుంచి గణితం వరకు ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. పేపర్ లీక్ కారణంగా మాస్‌ కాపీయింగ్‌ పెరిగిపోతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిభకు ప్రాధాన్యం లేకుండా పోతోందని మనోవ్యధకు గురవుతున్నారు. దీన్ని సీరియస్​గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేయటంతో పాటు వారందరినీ సస్పెండ్ చేసింది. ఉద్దేశపూర్వకంగానే మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పిడినట్లు రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

ఇదీ చదవండి: పది పరీక్షల్లో గందరగోళం.. ఉత్తీర్ణత లక్ష్యాలతోనే.. పరీక్షల్లో అక్రమాలు ..!

ABOUT THE AUTHOR

...view details