అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్లోకి వస్తున్న డ్రగ్స్ను దిల్లీ, నొయిడాల్లోని గోదాముల్లోకి చేర్చి, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారని డీఆర్ఐ దర్యాప్తులో గుర్తించారు. దిల్లీలోని ఓ గోదాములో 16.1 కిలోల హెరాయిన్, 10.2 కిలోల కొకైన్ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. నొయిడాలోని ఓ ఇంట్లో 11 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్లో నల్లధనం లావాదేవీలు ముడిపడి ఉన్నందున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. అఫ్గానిస్థాన్లో తాజాగా తాలిబాన్ల తిరుగుబాటు పరిణామాల దరిమిలా ఉగ్ర ముఠాల పాత్రపై శోధించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరుపుతోంది.
అఫ్గానిస్థాన్, ఇరాన్లోని ముఠాల నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు
గుజరాత్లోని ముంద్రా ఓడరేవులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడ్డ కేసులో నిందితుడైన మాచవరం సుధాకర్కు అఫ్గానిస్థాన్, ఇరాన్లోని ముఠాల నుంచి ఎప్పటికప్పుడు సందేశాలు అందేవని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించింది. అతని భార్య దుర్గాపూర్ణ వైశాలి పేరిట విజయవాడలో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీకి తీసుకున్న ఎగుమతి, దిగుమతుల కోడ్ (ఐఈసీ) లైసెన్సును మాదకద్రవ్యాల మాఫియాకు ఇచ్చినందుకు ఒక్కో కన్సైన్మెంట్పై రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు కమీషన్ అందేదని నిర్ధారించింది. గుజరాత్లోని కచ్ జిల్లా భుజ్ కోర్టు ఈ దంపతులిద్దరినీ పది రోజుల పాటు డీఆర్ఐ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. అక్కడ రెండు రోజులపాటు విచారించిన డీఆర్ఐ.. బుధవారం చెన్నైకి తరలించింది.