విజయవాడ పాత బస్తీలో టోకున నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న దీపారామ్ను వన్టౌన్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.40 వేలు విలువ చేసే నకిలీ శానిటైజర్ బాటిళ్లు, క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీ పులిపాటి వారి వీధిలో మాతశ్రీ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోళ్ల రంగులు తయారు చేసే దీపారామ్ కొవిడ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని శానిటైజర్ విక్రయాలపై దృష్టి పెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రముఖ బ్రాండ్ల పేరుతో స్టిక్కర్లు, బ్యాచ్ నంబర్లు గోదాములో బాటిళ్లకు అతికించి అందులో నకిలీ శానిటైజర్ను నింపి టోకున నగరంలోని దుకాణాలకు విక్రయిస్తున్నాడు. లీటరు రూ.100 చొప్పున క్యాన్లలో విక్రయించడంతో పాటు చిన్న స్ప్రే బాటిల్స్ హోల్సేల్ ధరలకు ఫ్యాన్సీ, మందుల దుకాణాలకు విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన గోదాము కోమలా విలాస్ సెంటరులో ఏర్పాటు చేసుకున్నాడు.
అక్కడ కొంత మంది మహిళలను పెట్టి వారి ద్వారా బాటిళ్లు, క్యాన్లపై బ్రాండ్ నేమ్ నకిలీ స్టిక్కర్లు, బ్యాచ్ నెంబర్లు అతికించే ఏర్పాటు చేసుకున్నాడు. పులిపాటి వారి వీధిలో వన్టౌన్ ఎస్సై శంకరరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ద్విచక్ర వాహనంపై క్యాన్లలో శానిటైజర్ తరలిస్తున్న విషయం వెలుగు చూసింది. పశ్చిమ ఏసీపీ హనుమంతరావు పర్యవేక్షణలో వన్టౌన్ పోలీసులు ఏకకాలంలో మాతాశ్రీ ఎంటర్ ప్రైజెస్తో పాటు కోమలా విలాస్ సెంటరులోని గోదాముపై దాడి చేసి 400 లీటర్ల శానిటైజర్ను స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది నకిలీ శానిటైజర్ల తయారీదారుల వివరాలపై కూడా పోలీసులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది.