ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు భాష, సంస్కృతి విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంది: మండలి బుద్ధప్రసాద్ - మండలి బుద్ధా ప్రసాద్ తాజా వార్తలు

తెలుగు జాతికి సమున్నత సాంస్కృతిక ఔన్నత్యం ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. అలాంటి తెలుగు భాష, సంస్కృతి విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తుందో, కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం కాని పరిస్దితి ఉందన్నారు.

mandali budha prasad fires on ycp over telugu academy
తెలుగు భాష, సంస్కృతి విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంది: మండలి బుద్ధా ప్రసాద్

By

Published : Jul 19, 2021, 1:49 PM IST

రాష్ట్రంలో ప్రస్తుతమున్న తెలుగు- సంస్కృత అకాడమీ సమస్యను పరిష్కరించకుండానే కొత్త వివాదానికి ఏపీ ప్రభుత్వం తెరతీసిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ ఆరోపించారు. తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందో.. కుట్రపూరితంగానో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా సాహిత్య, సంగీత, నృత్య, లలిత కళలు, చరిత్ర అకాడమీలకు ఆయా రంగాలకు సంబంధం లేని వారిని అధ్యక్షులుగా ప్రకటించారని ఆయన ఆక్షేపించారు.

‘‘ఏ జాతి ఔన్నత్యం అయినా ఆ జాతి సంస్కృతి, సాహిత్యంపై ఆధారపడి ఉంటుంది. మన తెలుగు జాతికి సమున్నత సాంస్కృతిక ఔన్నత్యం ఉంది. దేశంలో కళలు, సాహిత్యాన్ని పరిపోషించేందుకు తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అకాడమీలను నెలకొల్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అకాడమీలు నెలకల్పాయి. వాటికి ఆయా రంగాల్లోని నిష్ణాతులను అధ్యక్షులుగా నియమించేవారు. ఏపీలో సాహిత్య అకాడమీకి డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, సంగీత అకాడమీకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్య అకాడమీకి నటరాజ రామకృష్ణ, లలిత కళా అకాడమీకి పీటీ రెడ్డి వంటి లబ్ధ ప్రతిష్ఠులు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయా రంగాల్లో వారు తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. దురదృష్టవశాత్తు సీఎం జగన్‌ ఈ చరిత్రను గమనించకుండా ఆయారంగాలతో సంబంధం లేని వారిని నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న కవులు, కళాకారులు అనేకమంది ఉన్నారు. వారెవరినీ పరిగణనలోకి తీసుకోలేదంటే భాష, జాతి పట్ల ఎంత చులకన భావముందో అర్దమవుతోంది. వివిధ రాష్ట్రాల అకాడమీల అధ్యక్షులుగా విశిష్ట వ్యక్తులున్నారు. వారికి సరితూగే వారిని నియమించకపోతే నవ్వుల పాలవుతామన్న ఆలోచన రాకపోవడమే విచిత్రం. తెలుగు భాషా సంస్కృతుల విధ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోవడం వల్ల జాతి అస్థిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని నిలుపుకోవటం మనందరి కర్తవ్యం. ప్రజలు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు అందరూ స్పందించాల్సిన సమయమిది’’ -బుద్ధ ప్రసాద్‌, మాజీ ఉప సభాపతి

ఇదీ చదవండి:

సీఎం నివాసం పరిసరాల్లో ఉద్రిక్తత.. ఎక్కడికక్కడ అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details