రాష్ట్రంలో ప్రస్తుతమున్న తెలుగు- సంస్కృత అకాడమీ సమస్యను పరిష్కరించకుండానే కొత్త వివాదానికి ఏపీ ప్రభుత్వం తెరతీసిందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ఆరోపించారు. తెలుగు భాషా సంస్కృతులపై ప్రభుత్వం అవగాహనలేమితో వ్యవహరిస్తోందో.. కుట్రపూరితంగానో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా సాహిత్య, సంగీత, నృత్య, లలిత కళలు, చరిత్ర అకాడమీలకు ఆయా రంగాలకు సంబంధం లేని వారిని అధ్యక్షులుగా ప్రకటించారని ఆయన ఆక్షేపించారు.
‘‘ఏ జాతి ఔన్నత్యం అయినా ఆ జాతి సంస్కృతి, సాహిత్యంపై ఆధారపడి ఉంటుంది. మన తెలుగు జాతికి సమున్నత సాంస్కృతిక ఔన్నత్యం ఉంది. దేశంలో కళలు, సాహిత్యాన్ని పరిపోషించేందుకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అకాడమీలను నెలకొల్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అకాడమీలు నెలకల్పాయి. వాటికి ఆయా రంగాల్లోని నిష్ణాతులను అధ్యక్షులుగా నియమించేవారు. ఏపీలో సాహిత్య అకాడమీకి డాక్టర్ బెజవాడ గోపాల్రెడ్డి, దేవులపల్లి రామానుజరావు, సంగీత అకాడమీకి మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్య అకాడమీకి నటరాజ రామకృష్ణ, లలిత కళా అకాడమీకి పీటీ రెడ్డి వంటి లబ్ధ ప్రతిష్ఠులు అధ్యక్షులుగా పనిచేశారు. ఆయా రంగాల్లో వారు తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. దురదృష్టవశాత్తు సీఎం జగన్ ఈ చరిత్రను గమనించకుండా ఆయారంగాలతో సంబంధం లేని వారిని నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.