ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2020, 12:07 AM IST

ETV Bharat / city

మహానాడు 2020.. మెుదటి రోజు సాగిందిలా..!

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం సాగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. ఏడాదిలో ప్రజలపై 50 వేల కోట్ల రూపాయల పన్నుల భారం మోపి 80 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. రైతులను కూడా వదలకుండా ఇష్టానుసారం విద్యుత్‌ ఛార్జీలు పెంచి క్షమించరాని నేరానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆక్షేపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మహానాడు తొలి రోజు ఆరు తీర్మానాలను పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

mahanadu on zoom app first day highlights of chandrababu speech
mahanadu on zoom app first day highlights of chandrababu speech

తెలుగుదేశం పసుపు పండుగ మహానాడు తొలి రోజు వేడుక అట్టహాసంగా ముగిసింది. మొత్తం 8 తీర్మానాలకు ఇందులో ఆమోదం తెలిపారు. జూమ్‌ యాప్‌ ద్వారా 14వేల మంది వర్చువల్‌గా ఈ వేడుకలో పాల్గొనగా ఫేస్​బుక్, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వేలాది మంది కార్యక్రమాన్ని వీక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు 6 గంటల పాటు సాగిన తొలిరోజు కార్యక్రమంలో రెండు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ఆరు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు, మాట తప్పిన జగన్, కరోనా, వలస కార్మికుల అవస్థలు, తితిదే భూముల వ్యవహారం, అరాచక పాలనకు ఏడాది... ప్రమాదంలో ప్రజాస్వామ్యం, అన్నదాత వెన్ను విరిచిన జగన్., సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు తదితర తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించిన మహానాడు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టింది. సమయాభావం వల్ల తొలి రోజు చర్చించాల్సిన మరో మూడు తీర్మానాలను నేటికి వాయిదా వేశారు.

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై తీర్మానాన్ని ఎంపీ కేశినేని ప్రవేశపెట్టగా దాన్ని పార్టీ నేత బి.టి.నాయుడు బలపరిచారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై జగన్‌ మాటతప్పి మొత్తం వ్యవస్థనే భ్రష్టుపట్టించారని నాని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ప్రమాణస్వీకార సభలో చెప్పి ఏడాదిలో రెండుసార్లు 3 రెట్లు పెంచడమేంటని నిలదీశారు.

కరోనా వైరస్ విజృంభణ- వలస కార్మికుల కష్టాలు తీర్మానాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రవేశపెట్టగా..., మాజీ మంత్రి జవహర్‌, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి దీన్ని బలపరిచారు. కరోనాను నియంత్రించడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందని వారు దుయ్యబట్టారు. కేంద్రసాయాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ లబ్ధి కోసం తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా జగన్ వాడుకుంటున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. తితిదే ఆస్తుల అమ్మకంపై తీర్మానాన్ని ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ప్రవేశపెట్టగా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద సూర్య బలపరిచారు.

మానసిక రోగం లేకపోయినా సుధాకర్ ను మానసిక రోగిగా తయారు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. అరాచక పాలనకు ఏడాది - ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంశంపై మహానాడులో వర్ల రామయ్య తీర్మానం ప్రవేశపెట్టగా దానిని దువ్వారపు రామారావు, చెంగల్రాయుడు బలపరిచారు.

ప్రభుత్వం తక్షణమే రైతు రుణాలన్నింటినీ రద్దు చేసి లాక్డౌన్ కష్టాల నుంచి అన్నదాతలను ఆదుకోవాలని మహానాడులో తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసింది. అన్నదాత వెన్నువిరిచిన జగన్ సర్కార్ పేరిట పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా... సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర దీన్ని బలపరిచారు. వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్ లో ఈ ఏడాది మూడోవంతు మాత్రమే ఖర్చు చేశారని సోమిరెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 7 వేల 400కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. రైతు ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు వైకాపా దళారుల కేంద్రాలుగా మారాయని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

మహానాడులో సంక్షోభంలో సాగునీటి ప్రాజెక్టులు-తనవారికి కట్టబెట్టేందుకే పోలవరాన్ని రెండేళ్లు వెనక్కినెట్టారు-డ్యాం భద్రతకు చేటు తెచ్చారు పేరిట కాల్వ శ్రీనివాసులు తీర్మానం ప్రవేశపెట్టగా... నిమ్మల రామానాయుడు బలపరిచారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక బూటకమని, దీని వల్ల రాయలసీమలో ఒక్క ఎకరం కూడా సాగులోకి రాదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్‌ టెండరింగ్ చేసుకుని పోలవరాన్ని చంపేసిన వ్యక్తి జగన్ అని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

సమయాభావం వల్ల తొలి రోజు చర్చించాల్సిన మూడు తీర్మానాలను నేటికి వాయిదా వేశారు. తొలి రోజు వాయిదా పడిన తీర్మానాలు ప్రజా రాజధాని అమరావతి-మూడు ముక్కలాటలో రాష్ట్రాభివృద్ధి అధోగతి, బలిపీఠంపై బడుగు సంక్షేమం-34 పథకాల రద్దు, అక్రమ ఆస్తులు - ఆస్తుల విధ్వంసం - పోలీస్‌ వ్యవస్థ దుర్వినియోగం మూడు తీర్మానాలతో పాటు మరో ఆరు తీర్మానాలను ఇవాళ ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి: డిజిటల్ ఫ్లాట్​ ఫాంపై 'పసుపు జెండా'.. ఇది ఓ ప్రయోగమే!

ABOUT THE AUTHOR

...view details