ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం: లోకేశ్

ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్‌ ముందుకు సాగారని..,తెలుగువారి ఆత్మగౌరవం తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యమని చెప్పారు. బడుగులకు 1982లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు.

By

Published : Mar 29, 2022, 9:18 PM IST

Updated : Mar 30, 2022, 5:56 AM IST

రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం
రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం

రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యం

రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయలన్నా తెలుగుదేశంతోనే సాధ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అన్​స్టాపబుల్ ప్రజల పార్టీ అని, జగన్ రెడ్డిది గాలి పార్టీ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ది కేర్​ అఫ్ అడ్రస్ లేని పార్టీ అని విమర్శించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ 40వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన..ఎన్నికలకు మరో రెండేళ్లే ఉన్నందున నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉండి వారి సమస్యల పరిష్కరించాలని సూచించారు. తెలుగుదేశం కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు, వైకాపా నేతలకు సినిమా మొదలవుతోందని హెచ్చరించారు. అమెరికా వెళ్లినా, ఐవరీ కోస్ట్​కు వెళ్లినా ఎవరినీ వదిలేది లేదని అన్నారు. తన తల్లిని అవమానించి బాధించిన వారెవరినీ విడిచిపెట్టనని తేల్చి చెప్పారు. తనపై హత్యాయత్నంతో పాటు 11 అక్రమ కేసులు పెట్టారని, తాను దేనికీ భయపడట్లేదు కార్యకర్తలు తెగించి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

"విభజన తర్వాత బంగారు బాతు హైదరాబాద్‌ను కోల్పోయాం. హైదరాబాద్‌కు దీటుగా అమరావతి నిర్మాణం ప్రారంభించారు. ఒకే రాష్ట్రం... ఒకే రాజధాని మన నినాదం. అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుదే. కంపెనీలను తరిమేసి యువతను నిరుద్యోగులుగా మారుస్తున్నారు. మహిళలకు పసుపు-కుంకుమ పథకం అమలు చేశాం. నాన్న బుడ్డితో మహిళల పసుపు-కుంకుమ వైకాపా తుడిచేస్తోంది. చెత్త పన్ను, ఇంటి పన్ను పేరిట ఆస్తులు జప్తు చేస్తున్నారు. తెదేపా కార్యకర్తల పార్టీ.. జగన్‌ది దొంగలు, డెకాయిట్ల పార్టీ. తెలుగుదేశం నేత విజనరీ.. వైకాపా నేత ప్రిజనరీ. జగన్‌ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు.. అందరినీ వేధిస్తున్నారు. ఇబ్బంది పెట్టిన వైకాపా నేతలకు సినిమా మొదలవుతోంది. నా తల్లిని అవమానించిన వారెవరినీ విడిచిపెట్టను."- లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

బడుగులకు అప్పుడే స్వాతంత్య్రం వచ్చింది: బడుగులకు 1982లోనే అసలైన స్వాతంత్య్రం వచ్చిందని నారా లోకేశ్‌ అన్నారు. సామాన్యులను నాయకులను చేసింది తెలుగుదేశం పార్టీనేనని వ్యాఖ్యానించారు. ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్‌ ముందుకు సాగారన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో తొలిసారి మహిళలకు ఆస్తిలో సమాన హక్కును తమ పార్టీ కల్పించిందన్నారు. పెద్ద ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందన్నారు. 1984లో పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా తేేదేపా నిలిచిందన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబుకు ప్రధాని అవకాశాలు అనేకం వచ్చాయని తెలిపారు. అవకాశాలు వచ్చినా వారు ఏనాడు తెలుగు ప్రజలను వదిలిపెట్టలేదని లోకేశ్ అన్నారు.

"ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్‌ ముందుకు సాగారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగారు. తెలుగువారి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ. సామాన్యులను నాయకులను చేసింది తెదేపా. బడుగులకు 1982లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చింది. జనాభాలో సగం ఉన్న బీసీలకు అధికారం ఇచ్చింది తెదేపా. బీసీలను చట్టసభల్లో కూర్చోబెట్టింది తెలుగుదేశం పార్టీ. దేశంలో సంక్షేమం ఏంటో చేసి చూపింది ఎన్టీఆర్‌. పేదలకు తొలిసారిగా రూ.2 కిలో బియ్యం అందజేశారు. పేదలకు తొలిసారిగా పింఛన్లు అందజేసింది తెదేపా. తొలిసారి చౌకగా జనతా వస్త్రాలు తెదేపా అందజేసింది. దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసింది ఎన్టీఆర్‌. పటేల్‌-పట్వారీ, మున్సబ్‌ వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆర్‌. మండల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు పాలన తెచ్చారు."- లోకేశ్‌ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

బైక్ ర్యాలీ:తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు మంగళగిరి సమీపంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి మంగళగిరి వరకు, అక్కడి నుంచి తెదేపా కేంద్ర కార్యాలయం వరకు మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రత్యేకశోభను సంతరించుకుంది. పసుపు జెండాల తోరణాలు. బంతిపూలదండలతో ఆవరణను అందంగా తీర్చిదిద్దారు. పార్టీ నేతలు, కార్యకర్తల కోలాహలం, ఆనందోత్సాహాలు మిన్నంటాయి. మంగళవారం ఉదయం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు పూలదండలు వేసి, నివాళులర్పించారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి పి.అశోక్‌బాబు తెదేపా జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కె.ఎస్‌.జవహర్‌, పీతల సుజాతతో పాటు, వివిధ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ కార్యాలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేశ్‌ మోటార్‌సైకిల్‌ ర్యాలీ సాయంత్రం 4.30 సమయంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరింది. లోకేశ్‌ బుల్లెట్‌ బండిపై ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో యువత ఆయనను ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. చంద్రబాబు నివాసం నుంచి ఉండవల్లి సెంటర్‌, పాత జీఎన్టీ రోడ్డు మీదుగా... మంగళగిరికి చేరింది. అక్కడి నుంచి పట్టణ వీధుల మీదుగా, జాతీయ రహదారికి, పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరింది. మొత్తం 18 కి.మీ. దూరం సాగిన యాత్ర, పార్టీ కార్యాలయానికి చేరడానికి రెండు గంటల సమయం పట్టింది.

ఇదీ చదవండి: CBN and lokesh on formation day: 'తెదేపా ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుని నిలదొక్కుకుంటుంది'

Last Updated : Mar 30, 2022, 5:56 AM IST

ABOUT THE AUTHOR

...view details