వైకాపా దళారుల కోసమే ఇసుక విధానం : కొల్లు రవీంద్ర వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇసుక మీద ఆధారపడి పనిచేసే కార్మికులు పనిలేక పస్తులుంటున్నారన్నారు. ప్రతిపక్షం నిరాహారదీక్ష చేస్తే అణగదొక్కాలని చూశారని విమర్శించారు. అధికారులు ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయడం లేదని, ప్రభుత్వాన్ని ఎలా సమర్థించాలో ఆలోచిస్తున్నారన్నారు. వైకాపా దళారులు ఇసుక దొడ్డిదారిన అమ్ముతున్నారని, అధిక ధరకు ప్రక్క రాష్ట్రాలకు తరలిపోతోందని అన్నారు కొల్లు రవీంద్ర. వైకాపా అనుయాయులకు దోచిపెట్టడానికే ఇసుక ఉపయోగపడుతొందని అన్నారు.
కోట్లు పెట్టి రంగులేస్తూ.. ఆదా అంటారా..?
ఆధునాతనమైన రోడ్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, భూగర్భ కేబుల్ వ్యవస్థ లేకుండా చేయాలన్నది వైకాపా ప్రభుత్వం విధానంగా మారిందన్నారు. నూతన సచివాలయ భవనాలు కుదించాలనుకోవడం ఆదానా అని ప్రశ్నించారు. పంచాయతీ బిల్డింగులకు వైకాపా రంగులేయడానికి ఖర్చులా కనిపించడం లేదా... అది ఆదానా అని అన్నారు.
బందరు పోర్టు కేసీఆర్కు ధారాదత్తం చేస్తారా..?
పోలవరం, పీపీఏల విషయంలో వైకాపా ప్రభుత్వం రివర్స్లో వెళ్తోందని.... రాజధానిలో జరుగుతున్న పనులు ఆపేసి, గోరీలు కడతారా అని ప్రశ్నించారు. శాంతిభద్రతలు అసలు కనిపించడం లేదని, పాత్రికేయులపై దాడులు, హత్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కార్మికులు రోడ్డుమీదకు వచ్చి నిరసన చేస్తే దాడులు చేస్తున్నారు. కేసీఆర్కు బందరు పోర్టు ధారాదత్తం చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నెలరోజులు దాటుతున్నా మునిగిపోయిన బోటును బయటకి తీయలేని అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. కౌలు రైతులకు లబ్ధి చేకూర్చడానికి బదులు కులం పేరుతో చీల్చుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అకృత్యాలపై ప్రజాకోర్టులోనే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :
మీసం తిప్పిన అధికారిపై వర్ల రామయ్య ఫిర్యాదు