ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 30, 2019, 2:54 AM IST

Updated : Jul 30, 2019, 3:48 AM IST

ETV Bharat / city

"మా దేశానికి రండి"... జగన్​కు జపాన్ ప్రతినిధుల ఆహ్వానం

జపాన్​లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రి జగన్​ను భారత్‌లో ఆ దేశ కాన్సులేట్‌ జనరల్‌ కొజీరో ఉచియామ ఆహ్వానించారు. సీఎం జగన్​తో సోమవారం భేటీ అయి.. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

జపాన్ ప్రతినిధులతో జగన్

చెన్నైలోని జపాన్‌ కాన్సులేట్ జనరల్‌ కొజీరో ఉచియామ, ఆ దేశ ప్రతినిధులు మరికొందరు సీఎం జగన్‌తో సోమవారం సుమారు గంటపాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం తీసుకుంటున్న చర్యలను జగన్‌ వారికి వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు ధరలు తగ్గుతాయని పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు పక్షాల భాగస్వామ్యం ఉండాలని జగన్‌ ఆకాంక్షించారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ విధానాన్ని వివరించారు. ఈ విధానం ద్వారా పెట్టుబడుల దగ్గర నుంచి ఉత్పత్తి దశ వరకూ పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏ దశలోనూ లంచాలకు, జాప్యాలకు తావుండదని స్పష్టం చేశారు.

అవకాశాలను పరిశీలించండి

పరిశ్రమల వృద్ధికి శాంతి, సహృద్భావ వాతావరణం అవసరమని ఇందులో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం తీసుకొచ్చినట్టు జపాన్‌ ప్రతినిధులకు జగన్ వివరించారు. మానవవనరుల అన్వేషణకు ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ విశదీకరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన ఉందని ఆ దిశగా పెట్టుబడులు వచ్చేలా చేయాలని ప్రణాళికలు చేయాలని జపాన్‌ కాన్సులేట్ జనరల్‌ను కోరారు. ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఔషధ తయారీ పరిశ్రమల కోసం భూముల కేటాయింపునకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జగన్‌ స్పష్టం చేశారు. కోల్డ్‌ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని జగన్‌ కోరారు.

మా దేశానికి రండి
అత్యాధునిక వసతులున్న పోర్టులు, నైపుణ్యమున్న మానవవనరులు అందుబాటులో ఉన్నందున జపాన్‌ సంస్థలకు రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని అధికారులు వారికి తెలియజేశారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, ఆహార సంబంధిత పరిశ్రమలు, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్‌ వ్యవసాయశాఖ మిజుహొ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్సిటిట్యూట్‌ చేత విశ్లేషణ చేయిస్తోందని ఓసారి జపాన్‌లో పర్యటించాలంటూ సీఎం జగన్‌ను జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఉచియామ ఆహ్వానించారు.

Last Updated : Jul 30, 2019, 3:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details