ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 28, 2021, 11:00 AM IST

ETV Bharat / city

సంగం డెయిరీ ఆస్తుల అప్పగింతపై ఎంపీ రఘురామ వ్యాజ్యంపై విచారణ జూన్ 3కు వాయిదా

సంగం డెయిరీ ఆస్తులను అమూల్​కు అప్పగించటంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జూన్ 3కు వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరిన ప్రభుత్వ న్యాయవాది.. సానుకూలంగా స్పందించకపోవటంతో జూన్ 3కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

highcourt
హైకోర్టు

సంగం డెయిరీ ఆస్తులను అమూల్‌ సంస్థకు బదలాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిని సవాలు చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జూన్ 3కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ కె.సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎంపీ వ్యాజ్యంలో పేర్కొన్నారు.

హైకోర్టులో విచారణ ప్రారంభంకాగానే.. గురువారం ఉదయం కౌంటర్ వేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ తెలిపారు. కౌంటర్ దస్త్రం ఉదయం 11 గంటలకు అందిందని పిటిషనర్ తరపు న్యాయవాది వి.ఆదినారాయణరావు చెప్పారు. అమూల్ వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రభుత్వ సొమ్ము, సిబ్బంది వనరులను వినియోగించకుండా నిలువరించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అప్పటి వరకు యథాతథాస్థితి(స్టేటస్‌ కో) పాటిస్తారా అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు ఎస్​జీపీ సానుకూలంగా స్పందించలేదు. దీంతో విచారణ జూన్ 3కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

తమ కక్షిదారులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాదులు అశోక్ రామ్, జీఆర్ సుధాకర్ న్యాయస్థానాన్ని కోరారు. ఎంపీ వ్యాజ్యంపై మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తే పాడి రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. మీ విజ్ఞప్తితోనే అమూల్​కు సంగం డెయిరీ ఆస్తులను ప్రభుత్వం అప్పగిస్తోందా?, ఈ విషయంలో మీ ఆసక్తి ఏమిటీ? అని కోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానం సమయాన్ని వృథా చేయవద్దని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:CM Jagan review: నేడు పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్‌ సమీక్ష!

ABOUT THE AUTHOR

...view details