దేవాదాయశాఖలో ఎస్టేట్స్ విభాగం జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్(chandrashekar azad)పై వచ్చిన అభియోగాలపై.. మరోమారు విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం ఈవోగా పనిచేసిన సమయంలో.. అవకతవకలకు పాల్పడినట్టుగా ఆయనపై వచ్చిన అభియోగాలపై తాజా విచారణకు దేవాదాయశాఖ కార్యదర్శి వాణి మోహన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆజాద్ పై వచ్చిన ఆరోపణలపై గతంలో ఐఏఎస్ అధికారి ఎం. పద్మ ను ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది. అయితే ఆమె గత ఏడాది ఉద్యోగవిరమణ చేయటంతో పాటు విచారణాధికారిగా ఆమె ఇచ్చిన నివేదికలో చంద్రశేఖర్ ఆజాద్ పై మోపిన అభియోగాలపై వివరణ సరిగా లేదని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో మరోసారి ఆజాద్పై విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.