ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గుడి గంటలు మోగనున్నాయ్.. మాల్స్​ తెరుచుకోనున్నాయ్​! - గుళ్లపై లాక్​డౌన్ ఎఫెక్ట్ న్యూస్

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలతోపాటు మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు జారీ చేసింది. కంటైన్​మెంట్​ జోన్లు మినహా.. మిగతా ప్రాంతాల్లో తెరవొచ్చని స్పష్టం చేసింది. మరికొన్ని నిబంధనలు పెట్టింది ప్రభుత్వం.

government about temples, hotels and malls reopen Guidelines
government about temples, hotels and malls reopen Guidelines

By

Published : Jun 6, 2020, 4:13 AM IST

దేవాలయాలు, ధార్మిక ప్రదేశాలతోపాటు మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర హాస్పిటాలిటీ సేవలకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 8వ తేదీ నుంచి తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. జూన్ 30వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటిస్తూనే.. వీటిని తెరుచుకునేందుకు పాక్షికంగా సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కంటైన్​మెంట్​ జోన్లు మినహా అన్ని చోట్లా మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఎక్కడా బహిరంగంగా ఉమ్మి వేయరాదని పేర్కొంది.

అయితే.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ధార్మిక ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఇతర మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంపై ఇప్పటికీ నిషేధం ఉందని ఉత్తర్వుల్లో గుర్తు చేసింది. షాపింగ్ మాల్స్​లో శీతలీకరణ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలని స్పష్టం చేసింది.

దేవాలయాల వద్ద క్యూ మేనేజ్​మెంట్ సవ్యంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను ముట్టుకోకుండా చూడాలంది. తీర్థ ప్రసాదాలను పంచేందుకు కానీ, పవిత్ర జలాలను పైన చల్లేందుకు కానీ అవకాశం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. సరైన భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ప్రార్థనా మందిరాల్లో కింద కూర్చొనేందుకు ఎవరి వస్త్రం వారే తెచ్చుకోవాలని సూచించింది.

హోటళ్లలో డిజిటల్ చెల్లింపులు, ఇ-వాలెట్ లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని తేల్చి చెప్పింది. హోటళ్లు, రెస్టారెంట్లలోని టేబుళ్లు, కుర్చీలు వినియోగదారుడు మారిన ప్రతీసారీ శానిటైజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. గేమింగ్ ప్రాంతాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ మూసే ఉంచాలని స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్​లోని సినిమా హాళ్లు తెరవకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ ప్రాంతాలన్నీ చోట్లా భక్తులు, వినియోగదారులు మాస్క్​లు ధరించడంతోపాటు పరిశుభ్రతను పాటించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:శ్రీవారి భక్తులూ ఇవి గమనించండి..!

ABOUT THE AUTHOR

...view details